Stay At Home : హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్లు 040-21111111, 23225397లో సంప్రదించాలని ప్రజలను కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, ట్రాన్స్ కో ఎండీ, ఈవీడీఎం డైరెక్టర్, హైదరాబాద్ కలెక్టర్తో మంత్రి ఇవాళ ఉదయం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. చెట్లు, కొమ్మలు కూలిన చోట నుంచి వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి తలసాని (Stay At Home) నిర్దేశించారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్ నీటిమట్టాలను పర్యవేక్షించాలన్నారు.
విద్యుత్ పరికరాలకు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హైదరాబాద్ ప్రజలకు ట్రాన్స్ కో సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే విద్యుత్ సిబ్బందికి చెప్పాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, భవనాల సెల్లార్లలోకి నీరు చేరినా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. నగరంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులతో ట్రాన్స్ కో సీఎండీ సమీక్షించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే 1912, 738207214, 7382072106, 7382071574 నంబర్లలో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. విద్యుత్ సంబంధిత సమస్యలను వాట్సప్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా తెలియజేయొచ్చన్నారు.