హైదరాబాద్ కుషాయిగూడలో విషాదం చోటుచేసకుంది. తాను గీసిన రంగోలిని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ ఓ బాలిక అపార్ట్మెంట్పై నుంచి కింద పడి మరణించింది. బాలికను శారదానగర్కు చెందిన కినారాగా గుర్తించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అపార్ట్మెంట్ ముందు కినారా రంగోలీ డిజైన్ వేసింది. కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక భవనంలోని ఐదవ అంతస్తుకు వెళ్లి రంగోలి డిజైన్ను టాప్-యాంగిల్ ఫోటోను తీయడానికి ప్రయత్నించిందని తెలిపారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో తీవ్రగాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. బాలికను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు