దుబాయ్ నుంచి కొచ్చి వెళ్తున్న విమానం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. నలుగురు ప్రయాణికులు.. విమానంలో ఉన్న తోటి ప్రయాణికులతో గొడవకు దిగడంతో పైలట్ హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న నలుగురు ప్రయాణికులు గొడవపడుతుంగా.. వారిని క్యాబిన్ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే నలుగురు యువకులు సిబ్బందిపై కూడా దాడికి యత్నించారు. పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న విమాన పైలట్ విమానాన్ని దారి మళ్లించి హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ల్యాండ్ అయిన వెంటనే నలుగురు వ్యక్తులను భద్రతా అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.