హైదరాబాద్లోని హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తికి చెందిన రమ్య(21) హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంలోని శ్రీదత్త ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి శోభన్ రెడీ మిక్స్ వాహనంలో డ్రైవర్గా పనిచేస్తున్నారు.
వీరు ఉప్పల్లో నివసిస్తున్నారు. అయితే రమ్య కాలేజీ దూరంగా ఉండడంతో బీఎన్ రెడ్డి నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. శనివారం కాలేజీ నుంచి వచ్చిన తర్వాత రమ్య రెండో అంతస్తులోని బాల్కనీ రెయిలింగ్పై కూర్చొని తన స్నేహితులతో కలిసి మాట్లాడుతోంది. ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి పడిపోయింది.
ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రమ్య తల్లిదండ్రులు ఆరోపించారు.