Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్ అయింది. తొమ్మిది పాక్ ఉగ్రవాద స్థావరాలను భారత సేనలు మే 7న(బుధవారం) విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్కు ‘సిందూర్’ అనే పేరును స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూచించారని తెలుస్తోంది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు మహిళలను వదిలేసి.. పురుషులను మాత్రమే చంపారు. ఆ దాడిలో చనిపోయిన 26 మంది కూడా పురుషులే. ‘‘మోడీకి వెళ్లి చెప్పుకోండి’’ అని బాధిత మహిళలకు ఉగ్రవాదులు చెప్పారట. ఈ దారుణ ఘటనలో ఎంతోమంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. సిందూరానికి దూరమయ్యారు. భర్తలను కోల్పోయిన, సిందూర భాగ్యానికి దూరమైన బాధిత మహిళల ఎమోషన్ నుంచే ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరును ప్రధాని మోడీ వెలికితీశారని అంటున్నారు. మొత్తం మీద ఈ పేరు దేశ ప్రజల మనసులను, ఎమోషన్స్ను టచ్ చేసింది. అయితే సిందూరానికి మన దేశ కల్చర్, హిస్టరీ, వైద్యంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఆ వివరాలపై ఓ లుక్ వేద్దాం..
Also Read :Pakistan Fail : మేడిన్ చైనా దెబ్బకు పాక్ బోల్తా.. భారత్ మిస్సైళ్లను గుర్తించలేకపోయిన HQ-9
సిందూరం ప్రాధాన్యత, చరిత్ర ఇదీ..
- సిందూరం(Sindoor) అంటే భారత్లో ఒక సాధారణ సామగ్రి మాత్రమే కాదు. అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన పదార్థం.
- తమ భర్తల యోగ క్షేమాలను కోరుకుంటూ వివాహిత మహిళలు నుదుటిపై సిందూరాన్ని ధరిస్తారు.
- సిందూరం మహిళల్లో రక్త ప్రసరణ ప్రక్రియ చురుగ్గా జరగడానికి దోహదం చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
- నుదుటిపై ఆజ్ఞా చక్రం అనే నాడీ మండల కేంద్రం ఉంటుంది. సరిగ్గా దాని ప్రాంతంలోనే సిందూరాన్ని దిద్దుతారు. దీని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. భావోద్వేగాలు, శారీరక వాంఛలు కంట్రోల్లో ఉంటాయి.
- మానవ శరీరంలో చక్రస్థానాలు ఉంటాయని చాలామంది నమ్ముతారు. సిందూరం అనేది ఒక మహిళ మానసిక శక్తినంతటినీ తన భర్తపై నిలిపి ఉంచేలా చేస్తుందని పెద్దలు అంటారు.
- భారత్లో 5వేల ఏళ్ల కిందటి నుంచే మహిళలు సిందూరం పెట్టుకుంటున్నారు. హరప్పా, మొహంజోదారో కాలం నుంచే సిందూరాన్ని భారతీయ వనితలు అలంకరణకు వాడుతున్నారు.
- ఐదు వేల సంవత్సరాలకు పూర్వం సింధూ నాగరికత కాలంలోనూ మహిళలు నుదుటన సిందూరం పెట్టుకునే వారట. దీనికి ఆధారంగా కొన్ని పురావస్తు సాక్ష్యాలు లభించాయి. హరప్పా ప్రాంతంలో లభించిన అమ్మతల్లి విగ్రహాల నుదుటన ఎర్రటి సిందూరం ఉన్నట్లు పురావస్తు పరిశోధకులు గుర్తించారు.
- పవిత్రమైన భారతీయ పురాణాల్లోనూ సిందూరం ప్రస్తావన ఉంది.
- సీతామాత నుదుటిపై సిందూరం ధరించేవారని రామాయణంలో పేర్కొన్నారు. నుదుటిపై సిందూరంతో సీతామాతను చూశానని హనుమంతుడు చెప్పినట్టుగా రామాయణంలో ప్రస్తావన ఉంది.
- పార్వతీ మాత, లక్ష్మీదేవి కూడా నుదుటిపై సిందూరం పెట్టుకునేవారని పురాణాల్లో ఉంది.
- సిందూరం అనేది ఎరుపు వర్ణంలోనే కాదు, కొన్ని ప్రాంతాల్లో నారింజ రంగులోనూ ఉంటుంది.
- ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని పూర్వాంచల్ ప్రాంతంలో మహిళలు నారింజ రంగు సిందూరం ధరిస్తారు.
- సిందూరానికి కేంద్ర ప్రభుత్వం 2017లో పన్ను మినహాయింపు కల్పించింది. సిందూరం, బొట్టు, గాజులను అత్యావశ్యకాలుగా పరిగణించి వాటిని జీఎస్టీ నుంచి మినహాయించింది.