Kavitha Interim Bail: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ (Kavitha Interim Bail) పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ బలంగా వాదించింది. మరోవైపు సాధారణ బెయిల్ పిటిషన్ విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
కవిత తరఫు న్యాయవాది, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ప్రీతీ చంద్ర కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ.. పరీక్షల సమయంలో తన పిల్లలతో కలిసి ఉండటానికి కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వవచ్చని విజ్ఞప్తి చేశారు. పరీక్షల షెడ్యూల్ను ప్రస్తావిస్తూ సింఘ్వీ కవిత 16 ఏళ్ల కుమారుడికి చాలా సబ్జెక్టులు ఉన్నాయని, తల్లి దృక్పథాన్ని తండ్రి సోదరి లేదా సోదరుడు భర్తీ చేయలేరని సూచించారు.
కవితకు బెయిల్ ఇవ్వొద్దు: ఈడీ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి షాకిచ్చింది. ఆమె రౌస్ ఎవెన్యూ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించింది. కవిత బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని ఆరోపించింది. ఈ కేసులో మరికొందరిని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా పలు ఆరోపణలు చేసింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమెపై ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘‘లిక్కర్ స్కాంలో ఆమె కీలక సూత్రదారి. మేం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదు. మాకు ఇచ్చిన 10 ఫోన్లలో డేటా అంతా డిలీట్ చేశారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు’’ అని ధర్మాసనానికి తెలిపింది.
అంతకుముందు జైలులో కవితకు అవసరమైన వసతులు కల్పించాలని అధికారులను రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కవిత తనకు అవసరమైన కొన్నింటిని స్వయంగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును న్యాయస్థానం కల్పించింది. కవిత ఏర్పాటు చేసుకున్న జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులను అనుమతించాలని అధికారులకు కోర్టు ఆదేశించింది. మెడిటేషన్ చేసుకునేందుకు జపమాల, లేసులు లేని బూట్లు, ప్రతిరోజు పత్రికలు అనుమతించాలని కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.