సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.
సౌదీ అరేబియాలో అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి.. ఏకంగా 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది భారతీయ యాత్రికులేనని.. ఇందులోనూ హైదరాబాద్కు చెందినవారు అధికంగా ఉన్నారని ప్రాథమిక సమాచారం అందుతోంది. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో (సౌదీ కాలమానం ప్రకారం) మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు బయలుదేరిన యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి.
ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటం వల్ల వారికి తప్పించుకునే అవకాశం దక్కలేదు. దీంతో 42 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్వాసులేనని తెలియడంతో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లేపల్లి, బజార్ఘాట్ ప్రాంతాలకు చెందిన సుమారు 16 మంది యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ఈ యాత్రికులు మెహదీపట్నంలోని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. మృతి చెందిన వారిలోనూ ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నట్లు తెలిసింది.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్తో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
బాధితుల కుటుంబాలకు సకాలంలో సమాచారం, సహాయం అందించేందుకు రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు లేదా సమాచారం కావాల్సిన వారు సంప్రదించడానికి అధికారులు హెల్ప్లైన్ నంబర్లను విడుదల చేశారు +91 79979 59754, +91 99129 19545 ద్వారా సంప్రదించాలని కోరారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో తెలంగాణ వాసులు ఉంటే వారు ఏ ఏజెన్సీ ద్వారా ప్రయాణించారో తెలుసుకునేందుకు హజ్ కమిటీ ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది.
