సుకేష్ చంద్రశేఖర్ పేరు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆర్థిక మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. జైల్లో ఉన్నప్పటికీ తరచుగా ఇతనికి సంబంధించిన విషయాలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇది ఇలా ఉంటే తాజాగా చంద్రశేఖర్ జైలులో ఉంటూనే రైల్వే శాఖకు ఒక లేఖ పంపాడు. ఇటీవల ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.10కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు సుకేశ్ ముందుకొచ్చాడు.
ఆ విరాళాన్ని అంగీకరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరాడు. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న సుకేశ్ అక్కడి నుంచే ఈ లేఖ పంపినట్లు తెలుస్తోంది. చట్టబద్ధమైన మార్గాల్లో సంపాదించిన సొమ్ములో నుంచే ఈ డబ్బును పంపిస్తున్నట్లు అతడు ఈ లేఖలో తెలిపాడు. ఇందుకు తాను ఆదాయపు పన్ను కూడా చెల్లించినట్లు తెలిపాడు. ఈ విరాళాన్ని స్వీకరించాలని రైల్వే మంత్రిని సుకేశ్ అభ్యర్థించాడు. విరాళాన్ని పంపేందుకు సంబంధిత విభాగ వివరాలను పంపాలని కోరాడు. తక్షణమే డిమాండ్ డ్రాఫ్ట్ను తయారుచేసి రూ.10కోట్ల విరాళాన్ని పంపిస్తానని తెలిపాడు.
ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు, రిటర్నుల వివరాలను కూడా డీడీతో పాటు అందజేస్తానని తెలిపాడు చంద్రశేఖర్. ఆ లేఖలో సుకేష్ ఈ విధంగా రాసుకొచ్చారు. ఒడిశా రైలు దుర్ఘటన దురదృష్టకరం. ఆ ఘటన నన్ను ఎంతగానో బాధించింది. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలుసు. కానీ, ఓ బాధ్యతాయుతమైన, ఉత్తమ పౌరుడిగా బాధిత కుటుంబాలకు నా వంతుగా రూ.10కోట్ల సహకారం అందిస్తున్నాను. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువులు, పెద్దదిక్కును పోగొట్టుకున్న కుటుంబాలను ఆదుకోవడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది అని సుకేశ్ ఆ లేఖలో పేర్కొన్నారు.