BRS Party: కాళేశ్వరంపై కాంగ్రెస్ పెద్ద కుట్రకు పాల్పడింది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 07:22 PM IST

BRS Party: ఎన్నికల ముందు రూ. 75 వందల కోట్లు రైతు బంధు నిధులు ఇవ్వకుండా అడ్డుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధు నిధులు దారి మళ్లించి కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని తెలంగాణ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేసిఆర్ పాలనలో రూ. 72,815 కోట్లు రైతు బంధు ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు 1.31 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉండగా కేసిఆర్ పాలనలో 2.38 కోట్ల ఎకరాలు సాగు విస్తీర్ణం పెంచామన్నారు. 2014 కు ముందు 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 3కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సామర్థ్యం పెంచామన్నారు.

పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను హోల్ సేల్ గా మోసం చేయడమే పాలనలో మార్పా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  రాష్ట్రంలో రైతులను గోసపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని విమర్శించారు. 110 రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రం మారిందన్నారు. తమ హయాంలోని పథకాలను అమలు చేయకుండా అటకెక్కించారని విమర్శించారు.

రూ.15 వేలు రైతు బంధు, రూ 2 లక్షలు రుణమాఫీ, తులం బంగారం, మహిళకు నెలకు రూ 25 వందలు, కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్ అమలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్ర ఖజానాను మంత్రులు బిల్లుల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పెద్ద కుట్రకు పాల్పడిందని ఆగ్రహించారు. కాళేశ్వరం శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన అధ్భుత కట్టడం బరాజ్ కం ప్రాజెక్ట్ అని అన్నారు. బరాజ్ లలో నీరు నిల్వ సామర్థ్యం తక్కువని సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కాళేశ్వరం నీటి నిల్వ సామర్థ్యం ఉందన్నారు. రెండు పిల్లర్లు పగుళ్లు బారితే కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని దుయ్యబట్టారు. రూ.80వేల కోట్లలతో కాళేశ్వరం నిర్మిస్తే, రూ లక్ష కోట్లు అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గు చేటు అని నిరంజన్ రెడ్డి అన్నారు.