రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం కేసీఆర్ అన్నారు. దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదన్నారు. అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని సీఎం కేసీఆర్ తెలిపారు.
అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ స్పూర్తితో దేశం ప్రగతిబాటలో నడువాలని సీఎం ఆకాంక్షించారు. విజయానికి సంకేతమైన దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. విజయదశమి స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు.