Bandi Sanjay: పేదలు పైసలిస్తే ఓట్లేస్తారనే అహంకారం ‘కేసీఆర్’ ది – ‘బండి సంజయ్’

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే నకిలీ విత్తనాలు అమ్మే నా కొడుకులను బొక్కలో తోస్తామని హెచ్చరించారు.

  • Written By:
  • Publish Date - April 18, 2022 / 12:14 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే నకిలీ విత్తనాలు అమ్మే నా కొడుకులను బొక్కలో తోస్తామని హెచ్చరించారు. నీళ్లు లేక అల్లాడుతున్న గద్వాల జిల్లా అలంపూర్ ప్రజలకు ఆర్డీఎస్ ద్వారా సాగు, తాగు నీరందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 5వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ అలంపూర్ నియోజకవర్గంలోని వేముల గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం క్రిష్ణారెడ్డి, వెంకటాద్రిరెడ్డి, డీకే స్నిగ్దా రెడ్డితోపాటు స్థానిక నేతలు యాదగిరిరెడ్డి, జగదీష్ రెడ్డి, కేకే రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. కేసీఆర్ అబద్దాల పుణ్యమా? అని రాజకీయ పార్టీల నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. మేం ఓట్ల కోసం రాలేదు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. ఎండలో తిరుగుతున్నాం. యాడికి పోయినా నీళ్ల సమస్యే చెబుతున్నారు. బీజేపోళ్లకు ఏం పన్లేదు… పచ్చగా ఉన్న పాలమూరులో చిచ్చు పెట్టడానికి మేం వస్తున్నామని కేసీఆర్ అంటున్నాడు…. ఎక్కడో ఉన్న కాళేశ్వరం…. 200 కి.మీల దూరంలో ఉన్న ఫాంహౌజ్ కు నీళ్లు తెచ్చుకోవడానికి రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ ఆర్డీఎస్ ద్వారా అలంపూర్ కు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదో కేసీఆర్ చెప్పాలి.
తెలంగాణలో ఏ ఒక్క రైతు లాభం కోసం వ్యవసాయం చేయడం లేదు. నకిలీ పత్తి విత్తనాలతో ఈ ప్రాంత ప్రజలు తల్లిడిల్లి పోతున్నారు. మిర్చికి తెగులొస్తే సాయం చేయలేదు. పండిన మిర్చిని అమ్ముకుందామంటే… మార్కెట్ లేదు. దళారులకు అమ్మి మోసపోతున్నారు. ఏనాడూ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం లేదు… కేసీఆర్ చేసిందేమీ లేదు… డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు. చాయ్ అమ్ముకునే పేద వ్యక్తి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక తెలంగాణకు 1.40 లక్షల ఇండ్లు మంజూరు చేశారు. కానీ కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టివ్వకుండా నిధులు దారిమళ్లించాడు. కేంద్రం ఇచ్చిన ఇండ్లన్నీ పూర్తి చేస్తే మరో 2 లక్షల ఇండ్లు ఇప్పిస్తానని కేసీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదు. ఇండ్లన్నీ పూర్తయితే బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో ఇండ్లు కట్టివ్వడం లేదు.
రేషన్ బియ్యం డబ్బులన్నీ కేంద్రం ఇచ్చేవే. ఒక్కో కిలో బియ్యానికి 29 రూపాయలు కేంద్రమే ఇస్తోంది. కేసీఆర్ భరించేది ఒక్క రూపాయి మాత్రమే. కేసీఆర్ కుటుంబంలో 5గురికి పదవులొచ్చాయి. కానీ యువకులకు మాత్రం ఉద్యోగాలివ్వడం లేదు. ఒక్క కుటుంబం కోసమా? తెలంగాణ సాధించుకుంది? తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసినోళ్లంతా పేదోళ్లే… ఇప్పుడు రాజ్యమేలుతోంది పెద్దోళ్లే.. నేను చస్తే పేదోళ్ల రాజ్యమొస్తుందనే ఆశతో పోలీస్ కిష్టన్న, శ్రీకాంతాచారిసహా ఎందరో యువకులు బలిదానాలు చేశారు. పేదోళ్ల రాజ్యం కావాలా? పెద్దల రాజ్యమే కావాలా? ప్రజలారా.. ఆలోచించండి. తెలంగాణలోని గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులకు నిధులిచ్చేది కేంద్రమే. కానీ టీఆర్ఎస్ చేసిందంటూ కేసీఆర్ పచ్చి అబద్దాలతో దుష్ప్రచారం చేసుకుంటున్నారు. పేదలంటే కేసీఆర్ కు చులకన. డబ్బులిస్తే ఓట్లేస్తారనే అహంకారంతో ఉన్నారు.
దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ప్రజలు చెంప చెళ్లుమన్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్డీఎస్ నీళ్లిచ్చి తీరుతాం. నెట్టెంపాడు నీళ్లిస్తాం.
నకిలీ విత్తనాలు అమ్మే నా కొడుకులను బొక్కలో వేస్తాం….మళ్లీ నకిలీ విత్తనాలు అమ్మకుండా కఠిన చర్యలు తీసుకుంటాం… ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడతలో పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇఛ్చాం. అమలు చేసి తీరుతాం. పెట్రోలు ధరలను బీజేపీ పెంచుతోందంటూ కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్…. వ్యాట్ పేరుతో లీటర్ కు రూ.30 దొబ్బుతున్నారు. ప్రజలారా.. ఆలోచించండి. బీజేపీని ఆశీర్వదించండి అని పిలుపునిచ్చారు బండి సంజయ్.