ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక హోదా రగడ జరుగుతున్న నేపధ్యంలో, తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రత్యేక హోదాపై సీఎం జగన్ స్టాండ్ ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతలతో సమావేశంలో భాగంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో యుద్ధం చేయలేక చేతులెత్తేశారని జగన్ వ్యావహారం శైలిని తప్పుపట్టారు చంద్రబాబు.
త్రిసభ్య భేటీ అజెండాలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా తమ ఘనత అని చెప్పుకున్న వైసీపీ నేతలు, ఆ తర్వాత ఆ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించగానే టీడీపీ పై బురద జల్లుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏపీలో ఆదాయం తగ్గకపోయినా, జగన్ సర్కార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. మోటార్లకు మీటర్ల బిగింపును వైసీపీ ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక లేని సమస్యలు క్రియేట్ చేసి చివరకు, సినీ ప్రముఖుల్ని ఇంటికి పిలిపించుకుని మరీ వారిని అవమానపర్చారని చంద్రబాబు ఆరోపించారు. మరి చంద్రబాబు వ్యాఖ్యల పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.