INDIA Name Change : ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు సంబంధించి మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. మన దేశం పేరును ‘ఇండియా (India)’ నుంచి ‘భారత్ (Bharat)’గా మార్చాలని కేంద్ర సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రాజ్యాంగాన్ని సవరించి, ఈ పార్లమెంట్ సెషన్ లో తీర్మానం చేసే ఛాన్స్ ఉందనే వార్తలు వినవస్తున్నాయి. జీ20 సదస్సుకు రావాలంటూ భారత రాష్ట్రపతి భవన్ నుంచి జీ20 దేశాల అధినేతలు, ఇతర ప్రత్యేక అతిథులకు పంపిన ఆహ్వాన లేఖల్లో President of India బదులుగా President of Bharat అని ముద్రించినట్టు తెలిసింది. తాజాగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీకి అందిన ఆహ్వానంలోనూ ఇదే విధమైన మార్పు కనిపించింది.
జీ-20 సదస్సుపై ప్రింట్ చేసిన బుక్ లెట్ లో కూడా ‘భారత్’ అనే పదాన్నే వాడారు. ‘భారత్, మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అని అందులో రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మన దేశం పేరు ఇండియా నుంచి భారత్ కు మార్పుపై ఊహాగానాలు (INDIA Name Change) జోరందుకున్నాయి.‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘ఇండియా: అది భారత్’ అనే పదబంధం ఉంది. ఈ పదబంధాన్ని మార్చాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఇది రాష్ట్రాలకు బలం చేకూర్చే సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న దాడి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఇక మంగళవారం ఉదయం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దీనిపై ట్వీట్ చేస్తూ.. ‘‘రిపబ్లిక్ ఆఫ్ భారత్ – మన నాగరికత అమృత్కాల్ వైపు వేగంగా అడుగులు వేస్తుండటం గర్వంగా ఉంది’’ అని రాశారు.