Site icon HashtagU Telugu

Sajjanar: మేడారం జాతర కారణంగా సాధారణ రూట్లలో బస్సులు తగ్గాయి : సజ్జనార్

TSRTC MD Sajjanar

TSRTC MD Sajjanar

మేడారం మహాజాతరకు తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆ జాతర కోసం వివిధ ప్రాంతాల నుంచి 6 వేల స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. దీనివల్ల సాధారణ రూట్లలో సర్వీసులు తగ్గిపోయాయి. దీనివల్ల మామూలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. జాతర పూర్తయ్యేవరకు సాధారణ ప్రజలు తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోంది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం.రెండేళ్లకో సారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ 6 వేల ప్రత్యేక బస్సులను TSRTC నడపుతోంది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌  ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది.

భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నదున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను.