ముంబైలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. రెండంతస్తుల భవనం బాల్కనీ కూలిపోయింది. నగరంలోని పశ్చిమ శివారులోని విలే పార్లే ప్రాంతంలోని నానావతి ఆసుపత్రి సమీపంలోని సెయింట్ బిర్సే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన ముంబై అగ్నిమాపక శాఖ (ఎంఎఫ్డి) శిథిలాల కింది చిక్కుకున్న వారిని రక్షించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుల సహాయంతో రెస్క్యూ బృందాలు ఐదుగురిని రక్షించి కూపర్ ఆసుపత్రికి పంపించాయి. అయితే ఆ తర్వాత ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున ఇలాంటి మరొక సంఘటనలో, ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో భవనంలోని ఒక భాగం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం రక్షించింది.