Brother Anil: ‘జగన్’ పై ‘బ్రదర్ అనిల్’ సంచలన వ్యాఖ్యలు

సోమవారం విశాఖపట్టణంలో ఏపీ సీఎం జగన్ బావ, వైఎస్ షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ పర్యటించారు.

  • Written By:
  • Updated On - March 14, 2022 / 04:42 PM IST

సోమవారం విశాఖపట్టణంలో ఏపీ సీఎం జగన్ బావ, వైఎస్ షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన BC, SC, ST సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘాల వాళ్లంతా తనకోసమే పనిచేశారు తప్ప జగన్ కోసం పని చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు బ్రదర్ అనిల్. తాను సీఎం జగన్ ను నేరుగా కలవాల్సిన అవసరం లేదని తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి జగన్ ను అస్సలు కలవనేలేదని వెల్లడించారు. ఆంధ్రాలో వైసీపీ విజయానికి కృషి చేసిన వాళ్లకు న్యాయం జరగడం లేదు.. పార్టీ కష్టకాలంలో… పార్టీతో నడిచిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.

పైరవీ కారులు, పైరవీలతో వచ్చిన వాళ్ళు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ… పార్టీ కోసం పని చేసిన వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను రాజకీయ పార్టీ పెట్టాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తోందని చెప్పిన బ్రదర్ అనిల్… పార్టీ పెట్టడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదని పేర్కొన్నారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు.. వైఎస్ కుటుంబంలో జగన్ కు షర్మిలకు మధ్య ఎలాంటి విభేదాలు నడుస్తున్నాయో అనేది. మొత్తంగా చూస్తే రాజకీయవర్గాలలో బ్రదర్ అనిల్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరోవైపు వైసీపీకి 151 స్థానాలు రావడానికి బ్రదర్ అనిల్ పిలుపే కారణమని తెలిపారు ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అనూక్. 2019 ఎన్నికల్లో జగన్ గెలవాలని ఎంతో కష్టపడ్డాం – మాకు 100 శాతం అన్యాయం జరిగింది – ప్రభుత్వంలో మా మొర వినేవారు లేరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అనూక్.