రాజస్థాన్ లో దారుణం జరిగింది. జైపూర్ జిల్లాలోని దుడు పట్టణంలో ఉన్న ఒక బావిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభించాయి. అయితే ఇవి హత్యలా? ఆత్మహత్యలా? అనేది తెలియాల్సి ఉంది. గృహ హింసను తాళలేక వీరు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అయితే పిల్లల్ని మరెవరైనా చంపి బావిలో పడేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన ముగ్గురు మహిళలు కూడా సొంత అక్కచెల్లెళ్ళు. వారి పేర్లు.. కాలూ దేవి(27), మమత(23), కమలేష్(20). చనిపోయిన ఇద్దరు చిన్నారులు(ఒకరు నాలుగేళ్లు, ఇంకొకరు 27 రోజులు) కూడా.. కాలూ దేవి పిల్లలే. మమత, కమలేష్ ఇద్దరూ గర్భంతో ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురిని చిన్న వయసులోనే ఒకే వ్యక్తికి ఇచ్చి 2003 సంవత్సరంలో పెళ్లి చేశారు.
అతడు రోజూ తాగొచ్చి ముగ్గురు అక్కా, చెల్లెల్లను చిత్రహింసలు పెట్టేవాడని పోలీసులు పేర్కొన్నారు. మృతురాలు మమత ఫోన్ లోని వివరాలు పరిశీలించిన పోలీసులు ఒక ముఖ్య విషయాన్ని గుర్తించారు. ఆత్మహత్య కు ఒకరోజు ముందు..ఆమె తన వాట్సాప్ స్టేటస్ లో ” “It is better to die once than to die every single day.” అనే మెసేజ్ పెట్టుకుంది. ప్రతి రోజు చస్తూ బతకడం కంటే ఒకేసారి చచ్చిపోవడం మేలు అని దాని అర్ధం. 15 రోజుల క్రితం కూడా భర్త కొట్టడంతో కాలూ దేవి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. ఇంటికి తిరిగొచ్చిన కొన్ని వారాలకే ముగ్గురు అక్కచెల్లెళ్ళు విగతజీవులుగా మారారు. భర్త అక్కా చెల్లెలు కూడా వారిని తరుచూ వేధించే వారని తెలిసింది.