Etela Jamuna : సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి ఒక కీలక అప్ డేట్ వచ్చింది. అక్కడి నుంచి బరిలోకి దిగేందుకు బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున రెడీ అవుతున్నట్లు తెలిసింది. గజ్వేల్ అసెంబ్లీ టికెట్ కోసం ఆమె బీజేపీ నాయకత్వానికి దరఖాస్తు సమర్పించారని సమాచారం. తెలంగాణ ఎన్నికల వ్యూహరచన కోసం బీజేపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలో ఈటల రాజేందర్ కీలక స్థానంలో ఉన్నందున.. ఆయన సతీమణి ఈటల జమునకు గజ్వేల్ టికెట్ ఖరారు కావడం ఖాయమనే (Etela Jamuna) అంచనాలు వెలువడుతున్నాయి.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల నుంచి బీజేపీ టికెట్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటి (సెప్టెంబరు 10)తో ముగిసింది. మొత్తం 6,003 మంది దరఖాస్తు చేసుకోగా.. చివరిరోజున ఏకంగా 2,780 అప్లికేషన్లు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అసెంబ్లీ టికెట్ కోసం ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపు రావు, డీకే అరుణ, లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోలేదు. దీంతో వారంతా లోక్ సభ ఎన్నికల్లోనే పోటీ చేస్తారని స్పష్టమైంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ కోసం, ఈటల రాజేందర్ హుజూరాబాద్ టికెట్ కోసం అప్లై చేసుకున్నారు. కాగా, సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.