Bandi: ‘కేసీఆర్’ పై పోరాటానికి ‘NRI’ ల మద్దతుకు కూడగట్టిన ‘బండి సంజయ్’..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారని, యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను అథోగతి పాలవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Written By:
  • Publish Date - March 28, 2022 / 12:30 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారని, యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను అథోగతి పాలవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఇందుకోసమేనా అన్ని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతమొందించి, బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా యుద్దం చేస్తున్నామని చెప్పారు. గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించి తీరుతామని పునరుద్ఘాటించారు. బీజేపీ చేపడుతున్న ఈ మహోద్యమంలో ప్రవాస భారతీయులంతా భాగస్వాములు కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

అమెరికాలోని ప్రవాస భారతీయులు ‘ఏక్ దక్కా – తెలంగాణ పక్కా’ అనే అంశంపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. అడపా ప్రసాద్, క్రిష్ణారెడ్డి అనుగుల, విలాస్ జంబుల ఆధ్వర్యంలో జరిగిన ఈ జూమ్ మీటింగ్ లో బండి సంజయ్ తోపాటు బీజేపీ ఫారిన్ డిపార్ట్ మెంట్ ఇంఛార్జీ విజయ్ చౌతేవాలె హాజరయ్యారు. అరవింద్ మొదలి, మధు చౌదరి బెల్లం, లక్ష్మీనారాయణ పేరి, శ్యామ్ ఇనగంటి, అశోక్ లౌసవిల్లి, భార్గవి కళ్యాణి, ప్రదీప్ బిరుకురి, నిర్మలారెడ్డి, సురేందర్ పోరెడ్డి, రామక్రిష్ణ, రఘు సహా వందలాది మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన బండి సంజయ్ ఎన్ఆర్ఐలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రవాసులంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మహోద్యమంలో జైళ్ల పాలై ఇబ్బంది పడుతున్న బీజేపీ కార్యకర్తలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.