Bandi: డ్రగ్స్ కేసులో ప్రమేయమున్నవారిని అరెస్ట్ చేసే దమ్ముందా ‘కేసీఆర్’ – ‘బండి సంజయ్’

Bandi Sanjay dares CM KCR to arrest real culprits behind drug case

  • Written By:
  • Publish Date - April 3, 2022 / 10:09 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మత్తులో ముంచెత్తుతున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎంకు సవాల్ విసిరారు. ‘‘మీ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారో పేర్లు వెల్లడిస్తా…. వారందరినీ అరెస్ట్ చేసి డ్రగ్స్ టెస్ట్ చేసే దమ్ముందా?’’అని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో బీజేపీ నేతల ప్రమేయం ఉంటే వాళ్లను విచారించి అరెస్ట్ చేసుకోవచ్చని తెలిపారు.

డ్రగ్స్ తీసుకునే, ప్రోత్సహించే నాయకులను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘ప్రైమ్ మినిస్టర్ కప్ -2022’’ పేరిట షాద్ నగర్ లో ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ ను బండి సంజయ్ ప్రారంభించారు. దాదాపు 400కు పైగా క్రికెట్ టీం సభ్యులతో పాటు పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు… పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ తరపున ‘ప్రైమ్ మినిస్టర్ కప్-2022’’ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్రికెట్ ఆడేందుకు 400కు పైగా టీమ్ లు రావడం గర్వంగా ఉంది. నిర్వాహకులను మనస్పూర్తిగా అభినందిస్తున్నా. కేసీఆర్ కు మందు తాగడం, పత్తాలడటం తప్ప క్రికెట్ ఆంటే అసలు ఇష్టమే లేదు. పొరపాటున టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే రాష్ట్రంలో అందరికి మందు తాగించి, పత్తాలాడిపించడమే పనిగా పెట్టుకుంటాడు. జనమంతా మత్తులో ఊగుతూ చస్తుంటే వినోదం చూస్తాడు. నేనడుగుతున్నా…. తాగి బండి నడపడం తప్పని పోలీసులు కేసులు పెడుతున్నారు కదా… మరి తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ ను ఏమనాలి? కేంద్రంలోని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ‘ఖేలో భారత్’ పేరిట క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది. గతంలో ఒలింపిక్స్ జరిగితే రజతం, కాంస్య పతకాలు రావడమే భారత్ కు గగనం.

కానీ మోదీ ప్రధాని అయ్యాక ఏకంగా మూడు గోల్డ్ పతకాలతోపాటు పెద్ద సంఖ్యలో రజత, కాంస్య పతకాలు సాధించడం దేశానికే గర్వకారణం. దేశంలో మారుమూల ప్రాంతంలోనైనా సరే క్రీడాకారులను గుర్తించి వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖేలో భారత్ పేరిట అనేక కార్యక్రమాలు చేస్తోంది.

మోదీ రోజుకు 18 గంటలు కష్టపడితే కేసీఆర్ రోజు కు 18 గంటలు తాగి ఊగడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు.

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఆడితే పాకిస్థాన్ గెలవాలనుకునే లుచ్చగాళ్ళను ఉరికించి కొట్టాలి. ఇండియా కా ఖానా… పాకిస్తాన్ కా గానా నహీ చలేగా… హిందుత్వ కా నాస్… పాకిస్తాన్ పర్ విశ్వాస్ నహీ చలేగా…

పాకిస్తాన్ తీవ్రవాదులు కాశ్మీర్ లో ఎంతటి నరమేధం సృష్టిస్తున్నారో చూస్తున్నారు కదా… కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సినిమాను మీరు అందరూ చూడండి. త్వరలోనే కేసీఆర్ కు పాతబస్తీ ఫైల్స్ సినిమా చూపిస్తా.

సీఎం కేసీఆర్ పాలనను గాలికొదిలేసి, ఫాంహౌజ్ కే పరిమితమయ్యాడు. ఆయన కొడుకేమో సీఎం సీటు కోసం డాడీ డాడీ అంటే… అది తప్పించుకోవడానికి ప్యాడీ ప్యాడీ అని గోల పెడుతూ తిరుగుతున్నాడు కేసీఆర్ అని విమర్శించారు బండి సంజయ్.

ప్రజా సమస్యలు పరిష్కరించాలని మేము అడుగుతుంటే మమ్ముల్ని బేవకూఫ్ గాళ్లని తిడుతున్నారు. ధాన్యం కొనమని అడిగితే మేం బేవకూఫ్ గాళ్లమా? ఆడుకోవడానికి స్టేడియం కావాలని అడిగితే బేవకూఫ్ గాళ్లమా? ఉద్యోగాలు కావాలని అడిగితే బేవకూఫ్ గాళ్లమా? ప్రజలు ఆలోచించాలి.

నీకు దమ్ముంటే డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న వాళ్ల ను అరెస్ట్ చేసి టెస్ట్ చేసే దమ్ముందా? ఆ కేసులో బీజేపీ వాళ్ళున్నా అరెస్ట్ చేయండి. మేం అడ్డు చెప్పం. ఎందుకంటే బీజేపీ డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉంటుంది. అలాంటి వారిని సహించే ప్రసక్తే లేదు. అలాగే టీఆర్ఎస్ లో, మీ కుటుంబ సభ్యుల్లో డ్రగ్స్ తీసుకునే వాళ్ల పేర్లు వెల్లడిస్తా…. వారందరినీ అరెస్ట్ చేసి డ్రగ్స్ పరీక్ష చేసే దమ్ముందా?

అని కేసీఆర్ ను ప్రశ్నించారు బండి సంజయ్. సీఎం కు దమ్ములేదు. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఉన్నోళ్ళంతా టీఆరెస్ వాళ్ళే. విచారణ పేరుతో హంగామా చేయడం… డబ్బులు దండుకున్నాక కేసును మూసేయడం కేసీఆర్ కు అలవాటుగా మారింది.
తెలంగాణ కోసం బలిదానం చేసిన 1400 మంది యువత ఆత్మలు కేసీఆర్ పాలనను చూసి ఘోషిస్తున్నాయి. అందుకే కేసీఆర్ కుటుంబ-నియంత-అవినీతి పాలనను అంతం చేసేందుకే ఈనెల 14 నుండి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నా… మీ అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నా అని పిలుపునిచ్చారు తెలంగాణ బీజేపీ రధసారధి బండి సంజయ్.