Balakrishna: హిందూపురంలో రేపు.. బాల‌కృష్ణ మౌన దీక్ష

  • Written By:
  • Publish Date - February 3, 2022 / 04:58 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లా ఏర్పాటు పై రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనే కాకుండా ప‌లు జిల్లాల్లో ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది. ఏపీ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు స‌ర్వం సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు పై ఇప్పటికే వివాదాలు చెల‌రేగాయి. జిల్లాల పునర్విభ‌జ‌న‌ను కొంద‌రు స్వాగ‌తిస్తుంటే, కొంద‌రు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ కొత్త డిమాండ్ల‌ను తెర‌పైకి తెస్తున్నారు.

ఇక ఇప్ప‌టికే అనంత‌పురం జిల్లాలో పెద్ద ఎత్తున‌ నిరసనలు వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేప‌ధ్యంలో, జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించ‌డ‌మే కాకుండా, హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేప‌ధ్యంలో తాజా మ్యాట‌ర్ ఏంటంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మౌన దీక్ష చేప‌ట్ట‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక గ‌తంలోనే హిందూపురం ప్రజ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి వారి చిరికాల కోరికైన హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని బాల‌కృష్ణ ఏపీ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ప్ర‌భుత్వం నుండి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో ఫిబ్ర‌వ‌రి4 శుక్ర‌వారం రోజున బాల‌కృష్ణ మౌన‌దీక్ష చేప‌ట్ట‌నున్నారు. మ‌రి జ‌గ‌న్ స‌ర్కార్ నుండి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.