Balakrishna: త‌న పోరాటం అన్‌స్టాప‌బుల్ అంటున్న బాల‌కృష్ణ‌..!

  • Written By:
  • Publish Date - February 5, 2022 / 12:24 PM IST

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ హిందూపురం నుండి భారీ ర్యాలీగా అనంత‌పురం బ‌య‌లుదేరారు. స‌త్య‌సాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని, లేకుంటే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని శుక్ర‌వార బాల‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో లేడికి లేచిందే ప‌రుగంటూ.. ఈరోజు బాల‌కృష్ణ అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌లిసి విన‌తిపత్రం ఇవ్వ‌నున్నారు.

బాల‌కృష్ణ‌తో పాటు టీడీపీ నేత‌లు, అఖిల‌ప‌క్ష నేత‌లు కూడా క‌లెక్ట‌ర్‌ను క‌ల‌వ‌నున్నార‌ని స‌మాచారం. ఇక ఇప్ప‌టికే హిందూపురం నుంచి బాలకృష్ణ భారీ ర్యాలీగా బయలుదేర‌డంతో, పోలీసులు అనంతపురంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. లేపాక్షి, చిల‌మ‌త్తూరు, కొడి కొండ మీదుగా అనంత‌పురానికి బాల‌కృష్ణ వెళ్తున్నారు. అయితే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకున్న‌వారినే క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోకి అనుమ‌తిస్తామ‌ని పోలీసులు చెబుతున్నారు.

ఇక శుక్ర‌వారం హిందూపురంలో పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు టీడీపీ శ్రేణులు, జిల్లా మద్దతుదారులతో కలిసి బాల‌కృష్ణ‌ భారీ ర్యాలీ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఆత‌ర్వాత టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి అంబేడ్కర్‌ కూడలి వ‌ద్ద‌ బాలకృష్ణ మౌన దీక్షకు దిగ‌డంతో, ప‌లువురు ఇత‌ర పార్టీ నేత‌లు కూడా బాల‌కృష్ణ‌కు మ‌ద్ద‌తు తెలిపి హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం హిందూపురంలో ప‌లు ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌ని స‌మాచారం.