భారత భద్రతా దళాలకు కొత్త యూనిఫాం డిజైన్ పూర్తయింది. ఈ నెల 15న ఆర్మీ డే సందర్భంగా ఈ కొత్త యూనిఫామ్ను తొలిసారిగా ప్రభుత్వం ప్రదర్శించనుందని అధికార వర్గాలు తెలిపాయి. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ఆర్మీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎ్ఫటీ) ఈ యూనిఫామ్ను డిజైన్ చేసింది. సైనికుల సౌలభ్యం, వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని డిజిటల్ డిస్రప్టివ్ ప్యాటర్న్లో దీన్ని రూపొందించారు.
ఈ యూనిఫాం బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండదు. సైనికాధికారులు, జవాన్లకు వారి యూనిట్లలో దీన్ని అందిస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు ఓపెన్ టెండర్లు జారీ చేస్తారు.
ఉష్ణోగ్రతలు ఎంతగా పెరిగినా, మైనస్ డిగ్రీలకు పడిపోయినా శరీరం తట్టుకునేలా మన్నికైన, తేలికైన వస్త్రంతో దీన్ని అభివృద్ధి చేశారు. వీటి రంగులో మార్పులేమీ చేయలేదు. ప్రస్తుతం ఉన్న ఆలివ్ గ్రీన్, మట్టి రంగుల మిశ్రమం అలాగే ఉంటుంది. కానీ.. డిజైన్, క్లాత్ మారనుంది.
కాగా.. భారత ఆర్మీ యూనిఫాం మార్చడం ఇది నాలుగోసారి. స్వాతంత్ర్యానంతరం భారత్, పాకిస్థాన్ల డ్రెస్లు భిన్నంగా ఉండేందుకు తొలిసారిగా యూనిఫాం మార్చారు. 1980లో మరోసారి మార్పులు చేయగా.. చివరిసారి 2005లో బీఎ్సఎఫ్, సీఆర్పీఎ్ఫలకు వేర్వేరు యూనిఫాం ఉండాలన్న ఉద్దేశంతో మార్చారు.