Bengaluru Gas Charge Added By Hotels Amid LPG Shortage పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధం కారణంగా భారత్లోని సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. వంటింట్లో గ్యాస్ లేక హోటల్కు వెళ్లి తినాలనుకుంటే.. హోటల్ బిల్లుల్లోనూ మంటలు పుట్టిస్తూ సాధారణ ప్రజలు తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరతను సాకుగా చూపి కొన్ని హోటళ్లు కస్టమర్ల నుంచి ముక్కుపిండి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. తాజాగా చెన్నై, బెంగళూరు నగరాల్లో హోటల్ బిల్లుల్లో ‘గ్యాస్ సప్లై ఇష్యూ’ పేరుతో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఇదీ సంగతి.. ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని ఎవరన్నా ఊహించారా 😢😏 pic.twitter.com/E8w4ZZP8D2
— Guru Dharanidhar Medasani (B -ve Blood Group) (@GuruDharanidhar) March 12, 2026
బిల్లో కొత్త ఐటమ్.. కస్టమర్ల షాక్..!
సాధారణంగా హోటల్ బిల్లులో మనం ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలు, జీఎస్టీ కనిపిస్తాయి. కానీ బెంగళూరులోని ‘మిస్టర్ ఆంధ్రా మీల్స్’ అనే హోటల్కు వెళ్లిన ఒక కస్టమర్కు వింత అనుభవం ఎదురైంది. తాను తిన్న భోజనానికి అదనంగా రూ. 30 ‘గ్యాస్ సప్లై ఇష్యూ’ పేరుతో ఛార్జ్ చేయడాన్ని చూసి అతను అవాక్కయ్యాడు. తన హాస్టల్లో ఆహార కొరత ఉండటంతో హోటల్కు వస్తే.. ఇక్కడ ఇలాంటి దోపిడీ సాగుతోందంటూ ఆ కస్టమర్ సదరు బిల్లును సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్తా నెట్టింట వైరల్ అయింది.
హోటల్ అసోసియేషన్ సీరియస్
అయితే ఈ బిల్లు ఈ వివాదం కాస్తా ముదరడంతో బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సి. రావు స్పందించారు. “సదరు హోటల్ మా అసోసియేషన్లో సభ్యత్వం కలిగి లేదు. అయినప్పటికీ.. ఇలాంటి అనైతిక పద్ధతులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని సదరు హోటల్ యాజమాన్యంతో మాట్లాడి హెచ్చరిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఉండటం వాస్తవమే అయినా.. దాన్ని సాకుగా చూపి కస్టమర్లను లూటీ చేయడం సరికాదని సామాజిక కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.
చెన్నైలోనూ అదే పరిస్థితి..
చెన్నైలోనూ సిలిండర్ల సరఫరా లేక చాలా చిన్న హోటళ్లు ఇప్పటికే మూతపడగా.. నడుస్తున్న హోటళ్లు ఈ భారాన్ని వినియోగదారులపైకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా నగరంలోని పలు హోటళ్లలో.. “గ్యాస్ కొరత కారణంగా ధరలు పెంచాం.. వినియోగదారులు సహకరించాలి” అంటూ హోటల్ యజమానులు ప్రకటనలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా ఇడ్లీ, సాంబార్ ధరలతో పాటు గ్యాస్ బిల్లును కూడా విడిగా జోడించగా.. ఇందుకు సంబంధించిన బిల్లు కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
ఈరకమైన బిల్లులు చూసిన నెటిజెన్లు అంతా.. “ఇదేం దోపిడీ? గ్యాస్ కొరత ఉంటే ధరలు పెంచుకోవాలి కానీ.. ఇలా బిల్లో విడిగా ఛార్జీలు వేయడం ఏంటి?” అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే మేమేమైనా గ్యాస్ సిలిండర్లను కూడా మింగేస్తామనుకున్నారా? అంటూ ఏంటి అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలంటూ ఎక్స్ వేదికగా బెంగళూరు సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు.
Already in Bangalore PG announced food shortages and won’t be varieties. Went to hotel they are charging for gas shortage. Such a scam, they looting us every possible way @BlrCityPolice @CPBlr pic.twitter.com/ssBmc26DaA
— naresh kumar (@naresh__kumar_) March 11, 2026
