Uttar Pradesh: రైలు ప్రయాణికులకు చుక్కలు చూపించిన పాములు పట్టేవారు.. డబ్బులు ఇవ్వలేదని?

ఒక ట్రైన్ బోగీలో ఉన్నవారికి పాములు పట్టేవారు చుక్కలు చూపించారు. డబ్బులు ఇవ్వలేదని చిర్రెత్తుకొచ్చిన ఆ పాములు పట్టేవారు కొంత సమ

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 04:02 PM IST

ఒక ట్రైన్ బోగీలో ఉన్నవారికి పాములు పట్టేవారు చుక్కలు చూపించారు. డబ్బులు ఇవ్వలేదని చిర్రెత్తుకొచ్చిన ఆ పాములు పట్టేవారు కొంత సమయం పాటు ప్రయాణికులు అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. అసలేం జరిగిందంటే.. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. చంబల్ ఎక్స్ప్రెస్ తాజాగా హౌరా, గ్వాలియర్‌ల నడుమ ప్రయాణిస్తోంది. అయితే శనివారం సాయంత్రం బందా స్టేషన్ లో అందరితో పాటే ఒక నలుగురు పాములు పట్టుకునే వారు రైలు ఎక్కారు. వారు కొంచెం ఆగి రైలు కదలడం మొదలవగానే బుట్టలో నుంచి పాములను బయటకు తీసి ఆడించడం మొదలు పెట్టారు.

వాటి ఆటను చూసిన కొంతమంది ప్రయాణీకులు వారికి డబ్బులు ఇచ్చారు. మరికొంతమంది ఇవ్వలేదు. అయితే వారు వస్తాయనుకున్నన్ని డబ్బులు రాకపోవడంతో పాములు ఆడించేవారికి చిరెత్తుకొచ్చింది. దాంతో ఏం చేయాలో తెలియక
బుట్టలో నుంచి పాములను తీసి బయటకు వదిలారు. ఆ పాములు రైలులో తిరగడం మొదలు పెట్టాయి. దీంతో జనం ఒక్కసారిగా భయంతో ట్రైన్ లోనే పైన సీట్లలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కొంత మంది టాయిలెట్ లో దాక్కొని బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించారు. దాదాపు అరగంట పాటు ఈ తతంగం అంతా కొనసాగింది. ఈ క్రమంలోనే ఆ పాములను చూసి భయపడిన ప్రయాణికులు చాలామంది రైల్వే కంట్రోల్ రూం కి ఫోన్ చేసి కాపాడాలని కోరారు.

రైలు ఎక్కిన గంట తరువాత ఆ పాములు ఆడించేవారు మహోబా స్టేషన్ లో దిగి వెళ్లిపోయారు. అయితే ప్రయాణీకులు కూడా అక్కడే దిగి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. రైల్వే పోలీసులు వచ్చి బోగీ మొత్తం తనిఖీ చేసి పాములు లేవని నిర్ధారించారు. పాములు ఆడించేవారు వారితో పాటు తీసుకొని వెళ్లిపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే పోలీసులు వచ్చే లోపే పాములు ఆడింఛే వారు జారుకోవడంతో రైల్వే పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. ప్రయాణీకులు మాత్రం తమను ఇంతగా భయపెట్టిన వారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని పట్టుకొని కచ్ఛితంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.