Woman Kills: పెళ్లయిన 36వ రోజే.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది!

పెళ్లి అయిన 36వ రోజే భర్తను భార్య చంపేసింది. తన ప్రియుడు, అతడి నలుగురు స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది.

  • Written By:
  • Updated On - May 9, 2022 / 01:06 PM IST

పెళ్లి అయిన 36వ రోజే భర్తను భార్య చంపేసింది. తన ప్రియుడు, అతడి నలుగురు స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని సిద్దిపేట పట్టణంలో ఏప్రిల్ 28న చోటుచేసుకుంది. అయితే ఆ హత్యను గుండెపోటుగా చూపించి భార్య తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు నిజం ఆలస్యంగా మే 8న వెలుగుచూసింది.

మూడేళ్ళుగా ప్రేమ.. పెళ్లి .. హత్య..

వివరాల్లోకి వెళితే.. 19 ఏళ్ల శ్యామలకు , 24 ఏళ్ల కె.చంద్రశేఖర్ తో మార్చి 23న పెళ్లయింది. అంతకుముందు మూడేళ్ళుగా ఆమె శివ కుమార్ (20) అనే యువకుడితో ప్రేమలో ఉంది. తలిదండ్రులు బలవంతం చేయడంతో కె.చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కూడా శివ కుమార్ , శ్యామల మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఈక్రమంలో వారిద్దరూ కలిసి కె.చంద్రశేఖర్ ను అడ్డు తప్పించుకోవాలని పథక రచన చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 19న అన్నంలో ఎలుకల మందు కలిపి భర్త కె.చంద్రశేఖర్ కు ఇచ్చింది. ఫుడ్ పాయిజనింగ్ కావడంతో కె.చంద్రశేఖర్ వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. దీంతో శివ కుమార్ , శ్యామల మరో స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా.. తనను గుడికి తీసుకెళ్లాలని శ్యామల చెప్పింది. సరేనన్న భర్త కె.చంద్రశేఖర్ ఆమెను బైక్ పై కూర్చుబెట్టుకొని గుడికి బయలుదేరాడు. అనంత్ సాగర్ గ్రామం శివారుకు చేరుకోగానే వారి బైక్ ను శివ కుమార్ , అతడి నలుగురు స్నేహితులు ఒక కారుతో అడ్డుకున్నారు.

అనంతరం శ్యామల, శివ కుమార్, అతడి స్నేహితులు నలుగురు కలిసి కె.చంద్రశేఖర్ ను గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత శ్యామల తన అత్తింటి వాళ్లకు ఫోన్ చేసి.. ఛాతీ నొప్పితో కె.చంద్రశేఖర్ చనిపోయాడని చెప్పింది. అయితే కె.చంద్రశేఖర్ మరణంపై తనకు అనుమానం ఉందని అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కోణంలో విచారణ జరిపిన పోలీసులు శ్యామల, శివ కుమార్ ల హత్యాకాండను వెలుగులోకి తెచ్చారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు.ఆరుగురు నిందితులు కూడా 25 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.