తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వర్గీయ పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబసభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు (శుక్రవారం) విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్లో భారీగా సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిధులుగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రానున్నారు. ఎన్టీఆర్ ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను చంద్రబాబు, బాలకృష్ణ, రజినీకాంత్ ఆవిష్కరించనున్నారు. సభకు టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సభా ప్రాంగణంలో భారీకేడ్లు ఏర్పాటు చేసి..గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ సభ ప్రారంభం కానుంది.