Modi Vs Kharge : వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును పలువురు సీనియర్ నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే తన ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయొద్దని ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. ‘తొలుత సమష్టిగా పోరాడదాం.. ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దాం’ అని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈనేపథ్యంలో ప్రధాని మోడీని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఢీకొనగలరా ? ఆయనకు ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్ధిత్వం దక్కే అవకాశాలు ఎన్ని ? అనే దానిపై ఓ పరిశీలన..
We’re now on WhatsApp. Click to Join.
మల్లికార్జున ఖర్గే.. దేశంలోనే అగ్రగామి దళిత నేతల్లో ఒకరు. వరుసగా 10 సార్లు ఎన్నికల్లో గెలిచి ఆయన రికార్డు సృష్టించారు. 2022 అక్టోబర్ 26న కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఖర్గే వెనుదిరిగి చూసుకోలేదు. క్రమంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై పట్టు బిగించారు. గాంధీలకు మిస్టర్ డిపెండబుల్ అయ్యాడు. కాంగ్రెస్తో ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు కమ్యూనికేషన్ మార్గాలను తెరిచాడు. కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ విజయం అనేది ఖర్గే రాజకీయ వ్యూహం ఫలితమే అని అంటారు. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ ముఖంగా ఆయన ఎదిగారు. మల్లికార్జున ఖర్గేకు హిందీ, ఇంగ్లిష్, కన్నడం సహా మొత్తం ఎనిమిది భాషలు వచ్చు. ఖర్గే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి గ్రూపు రాజకీయాలు లేకుండా చేసేందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఖర్గేకు ఉంది.
ఖర్గేకు ఉన్న బలమే పెద్ద బలహీనత. ఆయన దళిత వర్గం నుంచి వస్తారు. ఖర్గే ప్రధానమంత్రి అభ్యర్ధిత్వానికి ప్రధాన ఆటంకం కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని బ్రాహ్మణ, బీసీ లాబీల నుంచి ఎదురయ్యే అవకాశం ఉంది. అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి వారు ఎత్తుకు పైఎత్తులు వేయకుండా ఉంటేనే ఖర్గే ప్రధాని అభ్యర్ధిత్వం ఖరారయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే వయసు 81 ఏళ్లు. 2019లో ఆయన లోక్సభ స్థానం నుంచి ఓడిపోవడంతో రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసింది.
దేశానికి ప్రధానిగా ఇప్పటివరకు 14 మంది సేవలందిస్తే వారిలో దక్షిణాది వాస్తవ్యులు ఇద్దరు (పీవీ నరసింహారావు, దేవెగౌడ) మాత్రమే. 1997 ఏప్రిల్ 21న దేవెగౌడ దిగిపోయిన తర్వాత.. ఈ పాతికేళ్లలో దక్షిణాదికి మళ్లీ అవకాశం దక్కలేదు. దక్షిణ భారత దేశంలో మోడీ హవా అస్సలు లేదు. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఖర్గే పేరును ప్రధాని అభ్యర్ధిత్వానికి ప్రకటిస్తే దక్షిణాదిలో ఇండియా కూటమి మరింత ఎక్కువగా సీట్లను గెలుస్తుందనే అంచనాలో కాంగ్రెస్(Modi Vs Kharge) ఉంది.