Russia – Kerala – Polls : రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో పోలింగ్.. ఎందుకు ?

Russia - Kerala - Polls : రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నేడు ప్రారంభమైంది.

Published By: HashtagU Telugu Desk
Russia Kerala Polls

Russia Kerala Polls

Russia – Kerala – Polls : రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నేడు ప్రారంభమైంది. ఇది మార్చి 17 వరకు కంటిన్యూ అవుతుంది. అయితే ఈ పోలింగ్ మనదేశంలోని కేరళ రాష్ట్రంలోనూ జరుగుతోంది. ఎందుకు అనుకుంటున్నారా ? రష్యా అధ్యక్షుడి ఎన్నికకు.. కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న కేరళకు సంబంధం ఏమిటి ? అని ఆలోచిస్తున్నారా ? దీనికి సమాధానం దొరకాలంటే ఈ వార్తను మీరు చదవాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join

గతంలో రష్యా అధ్యక్ష ఎన్నిక అంటే ఒక్కరోజులోనే పోలింగ్‌ పూర్తయ్యేది. రష్యా చరిత్రలో తొలిసారిగా వరసగా మూడు రోజులపాటు అంటే.. ఈనెల 15, 16, 17 తేదీల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే అక్కడ పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుత పదవీకాలంతో కలిపి పుతిన్‌ ఇప్పటికే నాలుగు సార్లు (2000, 2004, 2012, 2018) రష్యా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ఆ మధ్య 2008లో ప్రధానిగానూ సేవలందించారు.  ఈసారి కూడా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ఐదోసారీ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిరోహించాలనే పట్టుదలతో పుతిన్ ఉన్నారు. ఇక రష్యా అధ్యక్షుడి ఎన్నికకు కేరళలో గురువారం రోజు పోలింగ్ ఎందుకు నిర్వహించారో తెలుసుకుందాం. కేరళలో స్థిరపడిన రష్యన్లు, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రష్యా పర్యాటకులు ఓటుహక్కును వినియోగించుకునేందుకు తిరువనంతపురంలోని రష్యన్ ఫెడరేషన్ కాన్సులేట్ కార్యాలయం ‘రష్యన్ హౌస్‌’లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు.ఈ బూత్‌లో దాదాపు 60 మంది రష్యన్లు రష్యా అధ్యక్ష ఎన్నికల  కోసం ముందస్తుగా ఓటు వేశారు . రష్యన్ ఓటర్లలో ఎక్కువ మంది ఎర్నాకుళం, వర్కల, కోవలం నుంచి ఓటు వేయడానికి తిరువనంతపురానికి వచ్చారు. వీరు వేసిన ఓట్లతో కూడిన బ్యాలెట్ బాక్సులను తిరువనంతపురం(Russia – Kerala – Polls) నుంచి చెన్నైకు.. చెన్నై నుంచి మాస్కోకు పంపిస్తారు. మార్చి 17న జరిగే ఓట్ల లెక్కింపులో కేరళలో రష్యన్లు వేసిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

Also Read :Population Census : జనగణనకు భారత్ రెడీ.. ఏమేం చేస్తారో తెలుసా ?

ఓటింగ్ ప్రక్రియను సాంప్రదాయ పేపర్ బ్యాలెట్‌లను ఉపయోగించి నిర్వహించారు. రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో పోలింగ్ నిర్వహించడం ఇది మూడోసారి అని తిరువనంతపురంలోని రష్యన్ హౌస్ డైరెక్టర్ రతీష్ నాయర్ మీడియాకు వెల్లడించారు. కేరళలోని రష్యన్ పౌరులకు పోలింగ్ ప్రక్రియలో సహకరించినందుకు రష్యా కాన్సులేట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను రష్యన్ కాన్సులేట్ జనరల్, చెన్నైలోని సీనియర్ కాన్సుల్ సెర్గీ అజారోవ్ పర్యవేక్షించారు.

Also Read :Ugadi 2024 : ఉగాది రోజున ఆ మూడు రాశుల వారికి మహర్దశ

ఈసారి రష్యా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రస్తుత ప్రెసిడెంట్ పుతిన్‌తో పాటు ఎల్‌డీపీఆర్‌ నేత లియోనిడ్‌ స్లట్‌స్కీ, న్యూ పీపుల్‌ పార్టీ నేత వ్లాదిస్లేవ్‌ దవాన్‌కోవ్, కమ్యూనిస్ట్‌ పార్టీ నేత నికోలే ఖరిటోనోవ్‌లు బరిలో దిగారు. పుతిన్‌ను వీరంతా విమర్శిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకించడం లేదు. యుద్ధాన్ని వ్యతిరేకించిన ఏకైక విపక్ష నేత బోరిస్‌ నదేహ్‌దిన్‌ను పోటీకి నిలబడకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ అడ్డుకుంది. పోటీలో ఏ అభ్యర్థి నిలబడాలి అనేది దాదాపు రష్యా సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ(సీఈసీ)యే నిర్ణయిస్తుంది.

  Last Updated: 15 Mar 2024, 11:34 AM IST