Karnataka Politics: కన్నడ నాట ఏ అంశం ఎవరికి కలిసొచ్చేనో ?

అవినీతి ఆరోపణలు.. ఉచిత వాగ్దానాలు.. రెబల్స్ బెడద.. రిజర్వేషన్స్ రగడ..కర్ణాటక ఎన్నికల్లో అన్నీ కీలకాంశాలే.

  • Written By:
  • Publish Date - April 26, 2023 / 05:15 AM IST

Karnataka Politics: అవినీతి ఆరోపణలు.. ఉచిత వాగ్దానాలు.. రెబల్స్ బెడద.. రిజర్వేషన్స్ రగడ..కర్ణాటక ఎన్నికల్లో అన్నీ కీలకాంశాలే. నేతల హామీల నుంచి కోటా వరకూ ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. మరి ఏ అంశం ఎవరికి కలిసిరానుంది..? ఏ పార్టీ వ్యూహం ఎలా ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కర్ణాటకలో రాజకీయం వేడెక్కుతోంది. ఈసారి ఎన్నికల్లో ఉచితాలు కీలకపాత్ర పోషించబోతున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా హామీల వర్షం కురిపించాయి. ప్రతి గృహిణికి నెలకు 2వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు 3వేల అందిస్తామంటోంది బీజేపీ. పేద మహిళలకు నెలకు 2వేలు జీవన భృతి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తదితర వాగ్దానాలు చేసింది జేడీఎస్‌. తొలిసారి రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న ఆప్ కూడా ఏమీ వెనకబడలేదు. ఉచిత విద్యుత్, తాగునీరు, సాగు రుణ మాఫీ, పట్టణ ప్రాంత మహిళలకు ఉచిత బస్ పాస్ వంటి హామీలు గుప్పించింది.

బొమ్మై ప్రభుత్వ అవినీతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద అంశం అంటోంది కాంగ్రెస్‌. 40శాతం కమిషన్ సర్కారు అంటూ బలంగా ప్రచారం చేస్తోంది. పేసీఎం వంటి క్యాంపెయిన్స్‌తో ప్రజల్లోకి వెళ్తోంది. దీనికి కౌంటర్‌గా కర్ణాటక కాంగ్రెస్ ATM అంటూ ఎదురుదాడి చేస్తోంది బీజేపీ. ఇక నందిని వర్సెస్ అమూల్ వివాదం కూడా కర్ణాటక ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిని ఓట్లుగా మార్చుకునేందుకు గట్టిగానే పోరాడుతున్నాయి కాంగ్రెస్‌, జేడీఎస్‌. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ.. స్వయంగా నందిని పాల బూత్‌కు వెళ్లడం వైరల్ అయ్యింది.
ఎన్నికల వేళ బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడమే గాక బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్లు, ఒక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున బదలాయించింది. ఊహించినట్టే ముస్లింల నుంచి దీనిపై భారీ నిరసన ఎదురైనా ఈ ఎత్తుగడ హిందూ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటితం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఈ అంశాలన్నీ ఒక ఎత్తైతే.. తాజా ఎన్నికల్లో రెబల్స్ అత్యంత కీలకంగా మారారు. బీజేపీ 20కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటును ఎదుర్కొంటోంది. సీనియర్లు, సిట్టింగులను పక్కనపెట్టి .. కొత్తవారికి చాన్స్ ఇవ్వడం కమలదళాన్ని కష్టాల్లోకి నెట్టింది. కాంగ్రెస్‌కు కూడా కొన్నిచోట్ల రెబల్స్‌ ఉన్నారు. మొత్తం 918 మంది స్వతంత్రులుగా ఎన్నికల బరిలో ఉన్నారు. వీరి ఎవరు ఓటు చీలుస్తారో.. ఎవరి కొంప ముంచేస్తారో అర్థంకాక పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి.