తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ ఇంకా తొలగిపోలేదు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి మద్దతివ్వడానికి విద్యుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) కీలకమైన డిమాండ్లను ముందుకు తెచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో తమకు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించాలని వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ పట్టుబడుతున్నట్లు సమాచారం.
శుక్రవారం పార్టీ అధినేత అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశంలో ఈ మేరకు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమావళవన్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు, పార్టీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్లో స్థానం కల్పించాలని వీసీకే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీసీకే రెండు స్థానాల్లో విజయం సాధించింది.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే, అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి మరికొంత మద్దతు అవసరం కావడంతో వీసీకే కీలకంగా మారింది. మరోవైపు, రెండు నియోజకవర్గాల్లో గెలిచిన విజయ్, చెన్నైలోని పెరంబూర్ స్థానాన్ని అట్టిపెట్టుకుని, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. అక్కడ జరిగే ఉప ఎన్నికలో తిరుమావళవన్ పోటీ చేయవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
పదవులతో పాటు, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల హత్యల విచారణ కమిషన్లను కొనసాగించాలని, ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలు చేయాలని వీసీకే కోరుతోంది. ఈ పరిణామాల మధ్య, తిరుమావళవన్ నిన్న రాత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్తో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.
