తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మరణించడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుఃఖం వ్యక్తమవుతుండగా, ఈ విషాదం ఇప్పుడు రాజకీయ రంగు ఎత్తుకుంది. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పరోక్షంగా నటుడు-రాజకీయ నాయకుడు విజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో, అధికార డీఎంకే (DMK) మరియు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) మధ్య మాటల యుద్ధం మొదలైంది. “కరూర్లో జరిగిన దానికి అందరూ బాధ్యులే, కానీ ఒకరు మాత్రం ప్రధాన బాధ్యులు” అని ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు నేరుగా విజయ్ను ఉద్దేశించాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
Weight Loss: ఫాస్ట్ గా ఈజీగా బరువు తగ్గాలి అంటే రాత్రి పూట ఇవి తినాల్సిందే!
గుర్తించదగ్గ విషయం ఏమిటంటే, ఈ దుర్ఘటన విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ ర్యాలీలో చోటుచేసుకుంది. ర్యాలీ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి నియంత్రణ తప్పడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ విచారణ ప్రారంభమైంది, కానీ దీనిపై కూడా రాజకీయ వివాదం చెలరేగింది. డీఎంకే వర్గాలు బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సీబీఐని రంగంలోకి దింపిందని ఆరోపిస్తున్నాయి. “విజయ్ రాజకీయంగా ఎదగకుండా అడ్డుకునేందుకే సీబీఐ విచారణ చేపట్టింది” అని డీఎంకే నేతలు అంటున్నారు. మరోవైపు, టీవీకే నాయకులు మాత్రం తమపై జరుగుతున్న ఈ ఆరోపణలను “పూర్తిగా రాజకీయ కుట్ర”గా అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుతం ఉదయనిధి చేసిన వ్యాఖ్యలతో డీఎంకే–టీవీకే మధ్య రాజకీయ ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చింది. తమిళనాడులో విజయ్ ప్రజాదరణ పెరుగుతుండటంతో, డీఎంకే ఈ కొత్త పార్టీని తమ రాజకీయ ప్రభావానికి ముప్పుగా చూస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ పార్టీ ర్యాలీపై ఆరోపణలు, సీబీఐ విచారణ, రాజకీయ దాడులు ఇలా అన్ని కలిసి తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఇక రానున్న రోజుల్లో ఈ ఘటన డీఎంకే-టీవీకే పార్టీల మధ్య వాగ్వాదాలు, ఆరోపణల తూటాలు మరింతగా పెరగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
