కేరళ రాజకీయాల్లో ఒక దశాబ్దం తర్వాత పెను మార్పు చోటుచేసుకుంటోంది. వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న ఎల్డీఎఫ్ (LDF) కోటను బద్దలు కొడుతూ, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. కేరళ ఓటర్లు ఈసారి ‘మార్పు’ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కేరళ అసెంబ్లీలోని మొత్తం 140 స్థానాలకు గాను, ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం యూడీఎఫ్ 86 నుంచి 100 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 71ని సునాయాసంగా దాటేసి, భారీ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది. మరోవైపు, ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కేవలం 40-50 స్థానాలకే పరిమితమైంది. ధర్మదం నియోజకవర్గంలో పినరయి విజయన్ ప్రారంభంలో వెనుకంజలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే, మంత్రివర్గంలోని పలువురు కీలక మంత్రులు వెనుకంజలో ఉండటం ఎల్డీఎఫ్కు కోలుకోలేని దెబ్బ.
ముఖ్యమంత్రి రేసులో నలుగురు హేమాహేమీలు
యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ‘ముఖ్యమంత్రి ఎవరు?’ అనే అంశంపై మళ్లింది. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎవరి పేరును ప్రకటించకపోయినప్పటికీ, రేసులో నలుగురు ప్రధాన నేతలు ఉన్నారు:
వీడీ సతీశన్: ప్రతిపక్ష నేతగా ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై పోరాటం చేసిన ఆయనకు బలమైన అవకాశాలు ఉన్నాయి.
KC వేణుగోపాల్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న ఆయనను రాష్ట్రానికి పంపే యోచనలో హైకమాండ్ ఉంది.
రమేశ్ చెన్నితాల: గతంలో హోంమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్.
శశి థరూర్: తన మేధావి ఇమేజ్తో యువతను, పట్టణ ఓటర్లను ఆకర్షించిన థరూర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
బీజేపీ ప్రభావం మరియు భవిష్యత్ సమీకరణాలు
కేరళలో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని భావించినప్పటికీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతానికి కేవలం 1 నుంచి 4 స్థానాల్లో మాత్రమే ఎన్డీయే ఆధిక్యంలో ఉంది. పాలక్కాడ్లో శోభా సురేంద్రన్ వంటి నేతలు గట్టి పోటీ ఇస్తున్నారు. ఏదేమైనా, పదేళ్ల తర్వాత కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ముఖ్యమంత్రి ఎంపికపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
