కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారిక నివాసం ‘కావేరి’లో జరిగిన బ్రేక్ఫాస్ట్ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. సమావేశానికి హాజరైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు కొంతసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు.
సీనియర్ మంత్రులతో జరిగిన సమావేశంలో సిద్దరామయ్య మాట్లాడుతూ.. పార్టీ హైకమాండ్ నిర్ణయాలను గౌరవిస్తూ తాను స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, పార్టీ ఆదేశాలను పాటించడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సిద్ధరామయ్య మంత్రులకు వివరించారు. ఇదిలా ఉండగా, డీకే శివకుమార్ కూడా మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడిగా తనకు అందించిన సహకారానికి కేబినెట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే మద్దతు కొనసాగించాలని కోరినట్లు సమాచారం.
