Car Wash – 5000 Fine : తాగునీటిని కార్ వాషింగ్ కోసం.. గార్డెనింగ్ కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ హెచ్చరించింది. అలాంటి వాళ్లపై రూ.5 వేల జరిమానా(Car Wash – 5000 Fine) విధిస్తామని తేల్చి చెప్పింది. బెంగళూరులో ప్రస్తుతం తాగునీటి కొరత ఏర్పడింది. దాదాపు అన్ని చోట్లా బోర్వెల్స్ ఎండిపోయాయి. ఈ సారి వర్షపాతం తక్కువగా నమోదవడంతో బెంగళూరు వాసులు నీళ్లకు అల్లాడిపోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
నీటి ఎద్దడి ఉండటంతో బెంగళూరులో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు భారీగా దండుకుంటున్నాయి. 5 కిలోమీటర్లలోపు నీటిని సరఫరా చేస్తే 6వేల లీటర్ల నీటి ట్యాంకర్కు రూ.600 వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. 8వేల లీటర్ల నీటి ట్యాంకరుకు రూ.700, 12వేల లీటర్ల నీటి ట్యాంకరుకు రూ.1000 వరకూ వసూలు చేసుకోవచ్చని తెలిపింది. 5 కిలోమీటర్లు దాటితే.. 6 వేల లీటర్ల ట్యాంకర్కి రూ.750 ధరను నిర్ణయించారు. మామూలు రోజుల్లో కన్నా ఈ రేట్లు రెట్టింపు. ఇష్టమొచ్చిన ధరలకు నీళ్లని విక్రయిస్తే ఊరుకోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. బెంగళూరులో దాదాపు 60 శాతం మందికిపైగా ప్రజలు వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని 136 తాలూకాల్లో 123 చోట్ల కూడా నీటి కొరత ఉంది. ఈ 123 చోట్లలోని 109 తాలూకాల్లో నీటిఎద్దడి సమస్య తీవ్రంగా ఉంది.
బెంగళూరులోని పలు ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోయాయి. ప్రజలు నీటి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. AR నగర్లోని మొత్తం పట్టంగెరెలో ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో నీటిని తీసుకుంటే అధికారులు వెనక్కి పంపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.గోవులకు స్నానం చేసేందుకు, మేతకు నీరు దొరకడం లేదని ప్రజలు వాపోతున్నారు. మునిసిపల్ నీళ్లను వంటకు వినియోగించాల్సి వస్తోంది. గత మూడు నెలల నుంచి నీటి కొరత ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నీటి ధరలు తగ్గించిన తర్వాత ట్యాంకర్లు కూడా దూరం
నీటి కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని ప్రజలు వాపోయారు. తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ నుంచి ఒక క్యాన్ మాత్రమే తీసుకునేందుకు అనుమతి ఉంది. ఇప్పుడు ఒక్కో డబ్బాకు రూ.2000కు పైగా చెల్లించాల్సి ఉండగా, ఇంతకుముందు రూ.600 నుంచి 1000 వరకు వసూలు చేసేవారు. నీటి ధరలు తగ్గించాలని ప్రయివేటు ట్యాంకర్లను అడిగితే తమ ప్రాంతానికి రావడం మానేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు ప్రభుత్వానికి ఈ-మెయిల్స్ పంపుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.