Modi Guarantee Vs Rumors : వదంతులు ప్రజలను ఎంతగా తప్పుదోవ పట్టిస్తాయో నిరూపించే ఘటన ఇది. ఈజీ మనీపై ప్రజలకు ఉన్న అత్యాశను అద్దంపట్టే ఘటన ఇది. పోస్టాఫీస్లో మహిళలు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తే.. ‘మోదీ కీ గ్యారంటీ’ కింద రూ.3వేలు అకౌంట్లో జమ అవుతాయనే ప్రచారం జరిగింది. దీన్ని చాలామంది మహిళలు నమ్మారు. పోస్టాఫీసుకు క్యూ కట్టారు. కొత్తగా అకౌంట్లు తెరిపించుకున్నారు. ఇందుకోసం కొంతమందైతే పోస్టాఫీసు వాళ్లను బతిమిలాడుకొని మంగళవారం రాత్రి 7.45 గంటలకు వరకు క్యూలో నిలబడి మరీ అకౌంట్ను తెరిపించుకున్నారు. ఇదంతా ఫేక్ అని చెప్పినా పట్టించుకోలేదు. ప్రజల అత్యుత్సాహాన్ని చూసి పోస్టాఫీసు వాళ్లు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ కొత్త అకౌంట్లను జారీ చేశారు. చివరకు ఆ అకౌంట్ల ద్వారా డబ్బులేం రావని తెలియడంతో అకౌంట్లు తెరిపించుకున్న మహిళలు నిరాశకు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బల్లిలో చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచూ ‘మోడీ కీ గ్యారంటీ'(Modi Guarantee Vs Rumors) అని చెబుతున్నారు. ఈ పదాన్ని వాడుకొని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి తెర తీశారు. పోస్టాఫీస్లో పొదుపు ఖాతాలను తెరిచిన బీపీఎల్ కార్డు ఉన్న మహిళలకు ప్రతి మూడు నెలలకు రూ.3000 చొప్పున అందుతాయని వదంతులు వ్యాపింపజేశారు.వీటిని నమ్మిన మహిళలు మంగళవారం ఉదయం నుంచే ఖాతాలను తెరిచేందుకు హుబ్బల్లిలోని పోస్టాఫీస్ ఎదుట క్యూ కట్టారు. డబ్బులు ఫ్రీగా వచ్చే స్కీం ఏదీ తమ పోస్టాఫీసులో లేదని అధికారులు వాళ్లకు తెలిపారు. ఆ తరహా ప్రచారాన్ని నమ్మొద్దంటూ వెంటనే పోస్టాఫీసు ఎదుట పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు. అయినా సరే వినకుండా రాత్రి 8గంటల వరకు మహిళలు పోస్టాఫీస్కు వచ్చి అకౌంట్లు తెరిపించుకున్నారు. ‘‘మహిళలు తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోయారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయనే ఆశతో పోస్టాఫీసు అకౌంట్లు తెరిపించుకున్నారు. అనవసరంగా అకౌంట్లు తెరవొద్దని మేం చెప్పినా వినిపించుకోలేదు’’ అని సదరు పోస్టాఫీసు సీనియర్ పోస్ట్ మాస్టర్ ఎం కుమారస్వామి తెలిపారు.