టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని వెల్లడించారు. తాము ప్రస్తుతం రాజకీయాల్లో భాగమయ్యామని తెలిపారు.
రేపు (మే 20న) తన పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఇటీవలే తాను ప్రారంభించిన ‘ఐఖ్య’ (AIKYA… Dhairya Sena Samithi) సంస్థపై వస్తున్న సందేహాలకు ఈ సందర్భంగా ఆయన సమాధానమిచ్చారు. ‘ఐక్య’ అనేది రాజకీయ సంస్థ కాదని, ప్రజల గొంతుకగా ఉండేందుకు దాన్ని ప్రారంభించానని మనోజ్ తెలిపారు. ఈ సంస్థకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘ఐక్య’ కార్యకలాపాల కోసం తన సొంత నిధులనే వెచ్చిస్తానని ఆయన వివరించారు.
ఈ క్రమంలోనే, తన తండ్రి మోహన్ బాబుతో ఉన్న గొడవలు సద్దుమణిగాయా అని మీడియా ప్రశ్నించగా… “ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు తెలుసు. కానీ మైక్తో వెళ్లకండి, వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి” అంటూ మనోజ్ సరదాగా వ్యాఖ్యానించారు.
