Gali Janardhan Reddy : కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఇవాళ మళ్లీ బీజేపీలో చేరనున్నారు. ఆయన తన సొంత పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేర్పీపీ)ని బీజేపీలో విలీనం చేయనున్నారు. ఈరోజు కర్ణాటకలోని మల్లేశ్వరంలో ఉన్న బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారు. దీనిపై ఆదివారం రాత్రి గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ మా రక్తంలోనే ఉంది. ఇప్పుడు సొంత పార్టీలోకి తిరిగి వస్తున్నా. బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇద్దామని తొలుత అనుకున్నాం. కానీ నా పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్షను బీజేపీలో విలీనం చేస్తేనే బెటర్ అని మా కార్యకర్తలు చెప్పారు. అందుకే బీజేపీలో పార్టీని విలీనం చేస్తున్నా. మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేందుకు నావంతుగా సాయం చేస్తున్నా. బీజేపీలో చేరి సాధరణ కార్యకర్తగా పని చేస్తా’’ అని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి తన ఓటును కాంగ్రెస్కు వేశారు. అయితే అది తన మనస్సాక్షి ఓటు అని తాజాగా సమర్థించుకున్నారు. ఇక మాజీ మంత్రి శ్రీరాములుతో తనకు విభేదాలేం లేవని చెప్పారు. ఆయన్ను చిన్నప్పటి నుంచి తాను పెంచినట్లు తెలిపారు. బళ్లారి లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములుకు మద్దతిస్తానని చెప్పారు. 2022లోనే గాలి జనార్దన్రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేర్పీపీ)ని స్థాపించారు. ఈపార్టీని బీజేపీలో విలీనం చేయడానికి పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జనార్దన్రెడ్డితో(Gali Janardhan Reddy) పాటు కేర్పీపీ నేతలంతా కలిసి ఇవాళ బీజేపీ కండువా కప్పుకోనున్నారు. పార్టీ విలీనం విషయమై జనార్దన్రెడ్డి ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్షాతో చర్చలు జరిపారు.
ఈసారి కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను బలంగా ఢీకొట్టేందుకు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని బీజేపీ వాడుకుంటోంది. ఈక్రమంలోనే అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని తిరిగి బీజేపీలోకి ఆహ్వానించింది. ఆయన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరింది. దీనికి గాలి జనార్దన్ రెడ్డి వెంటనే ఓకే చెప్పారు. దీన్ని కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పొచ్చు. కాగా, బీఎస్యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. గనుల అక్రమ తవ్వకాల నేపథ్యంలో గాలి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత బీజేపీకి దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆయన సొంతగూటికి చేరుతున్నారు.