Jayalalitha Jewellery : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు 2014లో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. జయలలిత సన్నిహితులు శశికళ, ఇళవరసి, సుధాకరన్లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష, 10 కోట్లు చొప్పున జరిమానా వేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ నలుగురు కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేయగా అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరుగుతుండగానే 2016 డిసెంబరు 5న జయలలిత తుదిశ్వాస విడిచారు. ఈనేపథ్యంలో జయలలితపై కోర్టు విధించిన రూ.100 కోట్ల జరిమానాను రికవర్ చేసేందుకు.. ఆమెకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు. ఆమె చనిపోయాక జరిమానా కట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆస్తులు అమ్మి జరిమానా మొత్తాన్ని రికవర్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అప్పట్లో జయలలిత ఇంట్లో అవినీతి నిరోధకశాఖ స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు, 800 కిలోల వెండి నగలు, ఇతర వజ్రాభరణాలను కోర్టులో అప్పగించారు. ఈ నగలను వేలం వేసి వచ్చిన నగదుతో జరిమానా చెల్లించాలని నిర్ణయించారు. అందుకోసం నగలను మార్చి 6, 7న తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. వాటికి ప్రస్తుత విలువ నిర్ణయించి వేలం వేయనున్నారు. ఈ నగలే రూ.40 కోట్ల వరకు ధర పలకనున్నాయి. మిగిలిన రూ.60 కోట్లకు స్థిరాస్తులను వేలం వేయడానికి చర్యలు చేపట్టారు.జయలలిత అక్రమంగా సంపాదించిన బంగారు, వజ్రాభరణాలను(Jayalalitha Jewellery) తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ఇటీవల కర్ణాటకలోని బెంగళూరు కోర్టు తేదీని నిర్ణయించింది. మార్చి 6,7 తేదీల్లో ఆ ఆభరణాలను తీసుకోవడానికి 6 ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.