బెంగుళూరులో ఓ క్రాకర్ షాప్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనేకల్ తాలూకాలోని అత్తిబెలెలో శనివారం పటాకుల గోడౌన్-కమ్-షాప్లో మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. షాపు యజమాని సహా నలుగురికి గాయాలు అవ్వడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో తీవ్ర గాయాలపాలైన ఒకరిని మరో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. కొంతమంది వర్కర్స్ షాపులో పని చేస్తున్నప్పుడు మంటలు చెలరేగినట్లు గమనించారని. తప్పించుకునే ప్రయత్నం చేసేలోపు వారు మంటల్లో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి కాలిపోయిన ఆరు మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. ఇంకా ఎవరైన మంటల్లో చిక్కుకున్నారో లేదో తెలుసుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. వచ్చే దీపావళి పండుగ కోసం గోడౌన్లో లక్షల విలువైన పటాకులు నిల్వ చేశారు. అందులో మంటలు చెలరేగి పేలడం మొదలైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.