1400 KG Gold Seized : 100 కేజీలు కాదు.. 200 కేజీలు కాదు.. ఏకంగా 1425 కేజీల బంగారు బిస్కెట్లను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.700 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత భారీ గోల్డ్ ఎక్కడ దొరికింది.. అనుకుంటున్నారా ? తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న శ్రీపెరుంబుదూర్-కుండ్రత్తూర్ రహదారిలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో ఈ బంగారు బిస్కెట్లు దొరికాయి.
We’re now on WhatsApp. Click to Join
ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను అధికారులు చెక్ చేయగా అవాక్కయ్యారు. ఓ వాహనంలో 1000 కిలోల గోల్డ్ బిస్కెట్లు, మరో వాహనంలో 400 కిలోల గోల్డ్ బిస్కెట్లు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్ సమీపంలోని మన్నూర్లో ఉన్న ఓ గోదాముకు(1400 KG Gold Seized) తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం బంగారంలో 400 కిలోలకు మాత్రమే ఆధారాలు ఉన్నాయి. మిగతా 1000 కేజీల గోల్డ్కు సరైన డాక్యుమెంట్స్ లేవు. దీంతో వెంటనే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు.. చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా దీనిపై సమాచారం అందించారు.
దొరికిపోయిన బంగారు బిస్కెట్లను హాంకాంగ్ నుంచి విమానంలో చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడి నుంచి శ్రీపెరంబుదూర్ సమీపంలోని మన్నూరు ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీకి తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది. అక్కడి నుంచి వేర్వేరు వ్యక్తులకు ఈ బంగారాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిసిందని తాజాగా ఆదివారం రాత్రి స్థానిక పోలీసులు తెలిపారు. రంగంలోకి దిగిన ఐటీ శాఖ.. ఈ బంగారానికి అసలు యజమాని ఎవరు అనేది తెలుసుకునే పనిలో పడింది. యజమాని వివరాలు తెలియకుంటే.. మొత్తం బంగారాన్ని జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు అప్పగిస్తామన్నారు. విమానాశ్రయం నుంచి ఇంత బంగారం ఎలా బయటకు వచ్చింది? విమానాశ్రయంలో ఎవరు సహాయం చేశారు ? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఈ బంగారాన్ని నగదుగా మార్చుకుని ఎన్నికలకు వినియోగించేందుకు ప్లాన్ చేస్తున్నారా అనే కోణంలో ఎన్నికల ఫ్లయిండ్ స్క్వాడ్ విచారణ జరుపుతోంది.