Karnataka Congress: కర్ణాటకలో ‘హస్తం’ గాలి.. కాంగ్రెస్‌‌కు కన్నడిగులు జై!

ఏబీపీ-సీ ఓటర్ నిర్వహించిన ఒపీనియర్ పోల్‌‌లో కాంగ్రెస్‌వైపే కన్నడిగులు మొగ్గుచూపుతోన్నట్టు తేలింది.

  • Written By:
  • Updated On - April 12, 2023 / 10:36 AM IST

ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ కర్ణాటక వైపు చూస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైన కాంగ్రెస్ కర్ణాటకలో తన అద్రుష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే ఆ రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సర్వేలు సంచలన విషయాలను బహిర్గతం చేశాయి. అయితే కర్ణాటకలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? అనే ఉత్కంఠ తకు చెక్ పెట్టింది ఏబీపీ-సీ ఓటర్ నిర్వహించిన ఒపీనియర్ పోల్‌‌. ఈ సర్వేలో కాంగ్రెస్‌వైపే కన్నడిగులు మొగ్గుచూపుతోన్నట్టు తేలింది. కర్ణాటకలో ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించిన ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే తాజాగా ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే అంచనాల ప్రకారం హస్తం పార్టీకి కన్నడ ప్రజలు పట్టం కట్టనున్నట్టు వెల్లడయ్యింది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ 115-127 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

అధికార బీజేపీ 68-80 స్థానాలు, మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ 23-35 సీట్లను గెలుచుకుంటాయని సర్వే అంచనా వేసింది. ప్రాంతాల వారీగా చూస్తే 31 స్థానాలు ఉన్న హైదరాబాద్‌-కర్ణాటకలో కాంగ్రెస్‌ 19-23, బీజేపీ 8-12 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. 50 స్థానాలున్న ముంబై కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హోరా హోరీ పోరు తప్పదని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌ 25-29 స్థానాల్లోనూ, బీజేపీ 21-25 సీట్లను కైవసం చేసుకునే పరిస్థి ఉందని వివరించింది.

ఇక, 21 స్థానాలున్న కోస్తాలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్టు ఉందని, ఇక్కడ బీజేపీ 9-13 స్థానాల్లోను, కాంగ్రెస్‌ 8-12 స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉంది. బీజేపీకి కంచుకోట సెంట్రల్‌ కర్ణాటకలోనూ కాంగ్రెస్‌-బీజేపీల మధ్య హోరాహోరీ తప్పదని సర్వే పేర్కొంది. ఈ ప్రాంతంలోని 35 స్థానాల్లో బీజేపీ 12-16 స్థానాలు, కాంగ్రెస్‌ 18-22 స్థానాల్లోనూ, జేడీఎస్‌ 2 స్థానాల వరకూ విజయం సాధించే అవకాశం ఉంది.
పాత మైసూర్‌ ప్రాంతంలో మాత్రం జేడీఎస్ తన పట్టు నిలుపుకోనుందని వెల్లడయ్యింది. అక్కడ ప్రజలు జేడీఎస్‌తో పాటు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వే స్పష్టం చేసింది. మొత్తం 55 స్థానాలున్న పాత మైసూరులో జేడీఎస్‌ 26-27 స్థానాల్లోను, కాంగ్రెస్‌ 24-28 స్థానాల్లోను, బీజేపీ కేవలం 1-5 స్థానాల్లోనూ గెలిచే అవకాశం కనిపిస్తోంది.

బెంగళూరు నగరంలో కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్‌కు 15-19, బీజేపీకి 11-15 సీట్లు స్థానాలు దక్కే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రభావం చూపుతుందని ఏబీపీ-సీ ఓటరు సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 24.6 శాతం మంది ఇదే అభిప్రాయం వెల్లడించారు. కాగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ సీఎం సిద్దరామయ్య వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఆయనకు 39 శాతం మంది జైకొట్టగా.. ప్రస్తుతం సీఎం బసవరాజ్ బొమ్మైను 31.1 శాతం, జేడీఎస్ అధినేత కుమారస్వామిని 21.1 శాతం మంది కోరుకుంటున్నారు.
అటు, బీజేపీ ప్రభుత్వ పనితీరుపై 50 శాతం మందికిపైగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాలన బాగుందని కేవలం 27.7 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. సీఎం బసవరాజ బొమ్మై పనితీరును 47 శాతం మంది మంది వ్యతిరేకిస్తున్నారు. కేవలం 27 శాతం మంది మాత్రమే బాగుందని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి 57 శాతం మంది.. పాలన మారాలని కోరుకుంటున్నారు