Appu Yojana : కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ పేరుతో త్వరలోనే ఒక హెల్త్ స్కీం మొదలు కాబోతోంది. దాని పేరే.. “అప్పు యోజన”! “అప్పు” అనేది పునీత్ రాజ్కుమార్ మరో పేరు!! ఆకస్మిక గుండెపోటుతో పునీత్ రాజ్కుమార్ 2021 అక్టోబరు 29న మరణించారు. పునీత్ రాజ్కుమార్ కుటుంబం అందించనున్న నిధులతో “అప్పు యోజన” పథకాన్ని ప్రారంభించేందుకు కర్ణాటక సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.
ఆకస్మిక గుండెపోటుతో సంభవించే మరణాలను అరికట్టడమే లక్ష్యంగా “అప్పు యోజన” పథకాన్ని(Appu Yojana) త్వరలో ప్రారంభిస్తామని కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేశ్ గుండురావు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు బస్టాండ్, రైల్వేస్టేషన్, షాపింగ్ మాల్స్, ఎయిర్పోర్టులు వంటి బహిరంగ స్థలాల్లో కూడా ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్లను (AED) ఉపకరణాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు ఆ పరికరం సాయంతో ప్రథమచికిత్స చేయొచ్చని చెప్పారు. ఎక్స్టెర్నల్ డిఫిబ్రిలేటర్ ఉపకరణంతో గుండెపోటు బాధితులకు చికిత్స చేసిన తర్వాత గంటలోగా ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ నష్టాన్ని ఆపొచ్చని మంత్రి దినేశ్ గుండురావు వివరించారు. డిఫిబ్రిలేటర్ల ఏర్పాటుకు 2 వారాల్లోగా టెండర్లను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో జయదేవ ఆసుపత్రి ఈ ప్రాజెక్టుకు కేంద్రంగా ఉంటుందన్నారు.