Bomb Threat : కర్ణాటక రాజధాని బెంగళూరులోని 44 పాఠశాలలకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో పాఠశాలల నిర్వాహకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు బాంబు స్క్వాడ్స్.. వార్నింగ్ ఈమెయిల్స్ అందుకున్న స్కూళ్లలో తనిఖీలు చేశారు. పాఠశాలల ఆవరణలో ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అనేది తెలుసుకునేందుకు కూంబింగ్ చేశారు. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలల నుంచి విద్యార్థులను, సిబ్బందిని బయటికి పంపించారు. ఈక్రమంలో చాలా పాఠశాలలు త్వరగా వచ్చి పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులను కోరాయి. అయితే ఈ వార్నింగ్ ఈమెయిల్స్ బూటకమైనవి అయి ఉండొచ్చని బెంగళూరు నగర పోలీసులు అనుమానిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
“బాంబు దాడి చేస్తామనే బెదిరింపు ఈమెయిల్స్ 44 పాఠశాలలకు వచ్చాయని మేం గుర్తించాం. గత సంవత్సరం కూడా ఇలాంటి బెదిరింపులే 15 స్కూళ్లకు వచ్చాయి. అయినా మేం రిస్క్ తీసుకోలేం. అందుకే పాఠశాలలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నాం. ఆయా పాఠశాలల్లో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. బెదిరింపు ఈమెయిల్స్ పంపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అన్ని కోణాల్లో ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయిస్తాం’’ అని కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి పరమేశ్వర వెల్లడించారు. దీనిపై పోలీసు శాఖ నుంచి ప్రాథమిక నివేదిక తమకు అందిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. బెంగళూరులోని ఓ పాఠశాలకు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేరుగా అక్కడికి వెళ్లి పరిశీలించారు.