Thief Sleep : ఈ మధ్యకాలంలో వెరైటీ దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఆ కోవలోకే తాజాగా మరో దొంగ కూడా వచ్చి చేరాడు. దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ.. ఏసీ ఆన్ చేసుకొని హాయిగా నిద్రపోయాడు. కాసేపటి తర్వాత లేచి ఇంట్లోని వస్తువులన్నీ దొంగిలించి చెక్కేద్దామని అనుకున్నాడు. కట్ చేస్తే.. అప్పటికే తెల్లవారిపోయింది. అతన్ని భుజం తట్టి పోలీసులు నిద్ర లేపారు. యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పారు. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో ఉన్న ఇందిరానగర్ కాలనీలో ఈ వెరైటీ దొంగతనం జరిగింది. డాక్టర్ సునీల్ పాండేకు ఈ కాలనీలో ఇల్లు ఉంది. అయితే ప్రస్తుతం ఆయన వారణాసిలోని బల్రాంపూర్ హాస్పిటల్లో పని చేస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. దీంతో ఇందిరానగర్లోని డాక్టర్ సునీల్ ఇంటికి తాళం వేసి ఉంది. ఇదే అదునుగా ఆ ఇంట్లో దొంగతనానికి చోరుడు బరితెగించాడు. ఇటీవల ఓరోజు రాత్రి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ వెంటనే అల్మారా పగలగొట్టి దానిలోని నగలు, నగదు దోచుకున్నాడు. వాష్బేసిన్, గ్యాస్ సిలిండర్, నీటి పంపును సైతం దొంగలించాడు. ఇంటి బ్యాటరీని తొలగిస్తుండగా మత్తుగా అనిపించి.. ఏసీ ఆన్ చేసుకొని గాఢనిద్రలోకి జారుకున్నాడు.
మరుసటి రోజు ఉదయాన్నే .. ఆ డాక్టర్ ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడగా దొంగ గాఢనిద్రలో కనిపించాడు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా.. దొంగిలించిన వస్తువులన్నీ మూటకట్టి పక్కన పెట్టి ఉన్నాయి. దొంగ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. దీంతో పోలీసులే ఆ దొంగను నిద్రలేపారు. నిద్ర లేచేసరికి చుట్టూ పోలీసులు ఉండడంతో అతడు షాక్కు గురయ్యాడు. ఇక చేసేదేమీ లేక పోలీసులకు ఆ దొంగ లొంగిపోయాడు.