మన జీవితానికి సంబంధించిన చాలా విషయాలు గ్రంథాలలో పేర్కొన్నారు. గ్రంథాల్లో ఉన్న కొన్ని విషయాలకు కారణాలు మనకు తెలిసి ఉంటాయి. కొన్నింటికి కారణాలు తెలియవు. సాయంత్రం చీపురుతో ఇల్లు ఊడవకూడదు, రాత్రిపూట గోర్లు, జుట్టు కత్తిరించకూడదు, నేలపై కూర్చోని ఆహారం తినాలి…ఇలా ఎన్నో జీవితానికి నేరుగా సంబంధించిన ఆచారాలు మన గ్రంథాల్లో పొందుపరిచి ఉన్నాయి. వీటిలో ఒకటి దహన సంస్కార నియమాలు.
సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారాలు చేయకూడదనేది నియమాల్లో ఒకటి. హిందూగ్రంథాల్లో పదహారు మతకర్మల గురించి వివరించారు. ఈ సంస్కారాలన్నింటిలోనూ చివరిది అంత్యక్రియలు. ఇది వ్యక్తి మరణించిన తర్వాత జరుగుతుంది. అయితే ఈ ఆచారానికి కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించారు. ఇందులో సూర్యస్తమయం తర్వాత శవాన్ని దహనం చేయకూడదు. దీని వెనకున్న కారణం ఏంటి…గ్రంథాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
సూర్యస్తమయం తర్వాత దహన సంస్కరాలు నిషిద్ధమని గ్రంథాలలో ఎందుకు ఉంది..?
సూర్యస్తమయం తర్వాత అంత్యక్రియలు చేస్తే…మరణించిన వ్యక్తి మోక్షం లభించదని గరుడ పురాణంలో పేర్కొనబడింది. రాత్రి సమయంలో మరణించినప్పటికీ…దహన సంస్కారాలు మాత్రం సూర్యోదయం తర్వాతే చేయాలని గ్రంథాల్లో ఉంది. రాత్రిపూట అంత్యక్రియలు చేస్తే…స్వర్గ దారులన్నీ మూసివేయబడతాయి..నరక ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తే…నేరుగా నరకంలో స్థానం లభిస్తుంది. అంతేకాదు వచ్చే జన్మలో ఆ వ్యక్తి ఏదైనా అవయవలోపంతో జన్మించే అవకాశం ఉంటుందని కూడా నమ్ముతుంటారు.
ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం…
హిందూమతంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తారు. ఏ పనికూడా ఎలాంటి పద్దతి లేకుండా పూర్తి కాదు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని అంత్యక్రియలు కూడా పూర్తికర్మలతోనే నిర్వహిస్తారు. పూర్తికర్మలతో అంత్యక్రియలు చేయని వ్యక్తి వచ్చే జన్మలో మానవరూపం నుంచి విముక్తి పొందలేడని నమ్ముతుంటారు. వారి ఆత్మ సంచరిస్తూనే ఉంటుంది. మోక్షాన్ని కోల్పోతుంది. అందుకే సూర్యాస్తమయం తర్వాత దహనసంస్కారాలు చేయకూడదని గ్రంథాల్లో ఉంది.
అంత్యక్రియలు ఎలా చేస్తారు..?
వ్యక్తి మరణించాక…అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఒక కుండలో నీరు నింపి శవం చుట్టూ ప్రదక్షిణలు చేసి…చివరకు కుండను పగలగొడతారు. ఇలా చేస్తే శరీరంలో ఆత్మకు ఉన్న అనుబంధం కరిగిపోయి…అతను విముక్తి పొందుతాడని నమ్ముతారు.