UP : కొన్నిగంటల్లో కూతురు వివాహం…ఆత్మహత్య చేసుకున్న తండ్రి…!!

  • Written By:
  • Publish Date - November 28, 2022 / 09:25 AM IST

మరికొన్ని గంటల్లో కూతురు వివాహం. పచ్చటి తోరణాలు, పెళ్లిపందిరి, బంధువులతో ఆ ఇంట్లో సందడి నెలకొంది. కొన్నిగంటల్లో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆ పెళ్లికూతురు ఎన్నో ఆశలుపెట్టుకుంది. కన్న కూతురి వివాహం ఘనంగా జరిపించాలని ఆ తల్లిదండ్రులు పనుల్లో బిజీగా మారారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ పెళ్లికూతురు తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో జరిగింది. కూతురు పెళ్లి రోజే తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

పూర్తి వివరాల ప్రకారం…సునీల్ ద్విదేది లక్నోలోని మోహన్ లాల్ గంజ్ లో నివాసం ఉంటున్నాడు. అతనికి ఐదుగురు కుమార్తెలు. ఒక కుమారుడు ఉన్నాడు. నాలుగో కుమార్తె వివాహం…ఊరేగింపు ఆదివారం మధ్యాహ్నం కాన్పూర్ నుంచి రావాల్సి ఉంది. అయితే అదే రోజు సునీల్ ద్విదేది ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ ద్వివేది మద్యం సేవించాడాని కుటుంబసభ్యులు మందలించారు. అయితే గదిలోకి వెళ్లిన సునీద్ ద్విదేది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గదిలో నుంచి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు…కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించాడు. కూతుళ్ల పెళ్లిల కోసం తీసుకున్న అప్పులు అలాగే ఉండగా..నాలుగో కుమార్తె పెళ్లి కోసం కూడా అప్పు చేయాల్సి వచ్చిందని దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీల్ ద్విదేది ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు. ఘటనాస్థలానికిచేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.