Site icon HashtagU Telugu

Eating Habit: నేల మీద కూర్చుని తింటే బరువు తగ్గుతారా?

Sitting On Floor

Sitting On Floor

గతంలో ఇంటిళ్లపాది నేల మీద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుని భోజనం చేసేవారు. ఈ జనరేషన్‌ వాళ్లకు డైనింగ్‌ టేబుల్స్‌ అలవాటై కింది కూర్చోని తినడానికి అంతగా ఇష్టపడటం లేదు. పూర్వకాలంలో మహారాజులు కూడా కింద కూర్చునే భోజనం చేసేవారు. ఇప్పటికీ గ్రామాల్లో చాలా మంది కింద కూర్చునే భోజనం చేస్తారు. నేల మీద కూర్చుని భోజనం చేస్తే సౌకర్యంగానే కాదు, ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

జీర్ణక్రియ మెరుగవుతుంది:

నేల మీద కూర్చుని భోజనం చేస్తే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేలపై కూర్చుని తినేటప్పుడు ముందుకు వంగి తిరిగి అసలు భంగిమకు వస్తాం. దీని వల్ల జీర్ణ రసాలు బాగా విడుదల అవుతాయి. ఇవి ఆహారం సులభంగా జీర్ణం కావడంలో కీలకపాత్ర వహిస్తాయి. తద్వారా శరీరానికి కావలసినంత శక్తి అందుతుంది. మనం భోజనం చేయడానికి నేల మీద కాళ్లు మడిచి కూర్చున్నప్పుడు మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తుంది.

మీ భంగిమను సరిచేస్తుంది:

మనం భోజనం చేసేప్పుడు సరైన భంగిమలో కూర్చోవడం చాలా ముఖ్యం. మనం తినేటప్పుడు సరైన పోస్చర్‌లో కూర్చుంటే మన కండరాలు, కీళ్ళు, మోకాలు, వీపు, మెడ, చేతులపై అధిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నేల మీద కూర్చున్నప్పుడు మన భంగిమ ఆటోమెటిక్‌గా సరవుతుంది. మన వీపును నిటారుగా చేస్తంది, వెన్నముకను నిటారుగా ఉంచుతుంది, మన భుజాన్ని వెనక్కు నెట్టుతుంది.

బరువు తగ్గుతారు:

నేల మీద కూర్చుని తింటే మన బరువు కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది డైనింగ్ టేబుల్ పైన కూర్చుని ఎంత తిన్నామో తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. దీనివల్ల బరువు పెరుగుతారు. మనకు సరిపోయేంత తిన్నామా? లేదా? అనే విషయం తెలియడానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్‌ను అందించే ఒక నాడి ఉంటుంది. డైనింగ్ టేబుల్‌పై కూర్చొని తినడం కంటే కింద కూర్చొని తినడం వల్ల ఈ నాడి మరింత సమర్థంగా పనిచేస్తుంది. దీంతో మనం సరిపడా ఆహారం మాత్రమే తింటాం దీంతో బరువు కంట్రోల్‌లో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

మీ మైండ్ రిలాక్స్‌ అవుతుంది:

నేల మీద సుఖాసనంలో కూర్చుని భోజనం చేస్తే ఫోకస్‌ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం ఆటోమెటిక్‌గా మనం చేసే పని మీద శ్రద్ధ చూపేలా చేస్తుంది. మనస్సు నుంచి ఒత్తిడి తగ్గిస్తుంది. సుఖాసనంలో కూర్చుని భోజనం చేస్తే శరీరంలో ఆక్సిజన్‌ సర్క్యులేషన్‌ పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జీవిత కాలం పెరుగుతుంది:

నేల మీద కూర్చుని తింటే మన జీవితకాలన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం సుఖాసనం పై కూర్చుని ఏ సపోర్ట్‌ లేకుండా మనం పైకి లేవగలిగే వ్యక్తులు ఎక్కువకాలం జీవిస్తారు. సుఖాసనం నుంచి లేవడానికి బలం, స్టామినా అవసరం.

రక్తప్రసరణ మెరుగవుతుంది:

మనం సుఖాసనంలో కూర్చున్నప్పుడు పాదలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. అదనపు రక్తాన్ని గుండె ద్వారా ఇతర అవయవాలకు ప్రసారం చేయడం ప్రారంభిస్తుంది. ఇది జీర్ణక్రియకు అవసరమైన కార్యచరణను పెంచుతుంది. అలాగే టెన్షన్‌ని దూరం చేసి మనసును ఏకాగ్రతతో పాటు పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.

Exit mobile version