Side Effects of AC : మండువేసవి ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు సూరీడు. 8 గంటలు దాటితే చాలు.. మాడు పగిలే ఎండ కాస్తోంది. వడదెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. సాయంత్రం 6 గంటలైనా వేడి తగ్గడం లేదు. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు తాకడంతో.. వేడికి అల్లాడిపోతున్నారు. రోడ్లు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏసీ వేసుకుని పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటారు. కానీ.. రోజూ ఏసీలో పడుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పగలు, రాత్రి తేడాలేకుండా ఏసీలకు అలవాటుపడితే.. ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంటోంది. ముఖ్యంగా రాత్రంతా ఏసీలో పడుకుని ఉంటే.. ఉదయం వేళ శరీరం చాలా వేడిగా ఉంటుందని చెబుతున్నారు. శరీరం బిగుతుగా మారి ఒంటినొప్పులకు దారితీస్తుంది. ఏసీలో ఎక్కువ సమయం ఉంటే.. శరీరం అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. అలాగే శ్వాసతీసుకోవడంలోనూ ఇబ్బంది పడతారు. దగ్గు, జలుబు, ఛాతీలో నొప్పి వంటివి కలుగుతాయి.
గదిలో ఏసీ ఆన్ చేసినపుడు అది ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు.. తేమను కూడా తగ్గిస్తుంది. ఫలితంగా చర్మం పొడిబారుతుంది. కంటి అలెర్జీలు వస్తాయి. దురద, మచ్చలు ఏర్పడవచ్చు. రోగనిరోధక శక్తి కూడా తగ్గవచ్చు. రక్తనాళాలు కుచించుకుపోతాయి. అలర్జిక్ రైనైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే.. వీలైనంత వరకూ ఏసీని తక్కవ సమయం వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. గది ఉష్ణోగ్రత చల్లగా అయ్యేంతవకూ ఆన్ చేస్తే చాలని, ఆ తర్వాత ఏసీ ఆఫ్ చేసి ఫ్యాన్ వేసుకోవాలని చెబుతున్నారు. కాబట్టి ఎక్కువ సమయం ఏసీని ఆన్ చేయకపోవడం మంచిది.
Also Read : Green Shade Nets : ట్రాఫిక్లో హాయ్ హాయ్.. సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్స్