Lok Sabha Speaker Post : కేంద్రంలో గద్దెనెక్కిన ఎన్డీయే కూటమి పార్టీల మధ్య మంత్రి పదవుల పంపకాల ప్రక్రియ సాఫీగానే జరిగిపోయింది. ఇక కీలకమైన లోక్సభ స్పీకర్ పదవి వ్యవహారం మిగిలింది. ఆ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ పదవిని బీజేపీయే ఉంచుకుంటుందా ? ఆ పదవి కోసం ఆసక్తి చూపిస్తున్న టీడీపీకి కేటాయిస్తుందా ? లేదంటే వచ్చే ఏడాది అక్టోబరులో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జేడీయూకు స్పీకర్ పదవిని కట్టబెడుతుందా ? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join
బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజకీయ పార్టీ జేడీయూ కేంద్రంలో నాలుగైదు మంత్రి పదవులను కోరింది. ఆ పార్టీకి ఉన్న 12 మంది ఎంపీల బలం ఎన్డీయే కూటమికి కీలకంగా మారడంతో ఆయన ఈ రేంజులో పదవులను డిమాండ్ చేశారు. ఆయన కేవలం రెండు పదవులతో బీజేపీ సరిపెట్టింది. తమకు కనీసం లోక్సభ స్పీకర్ పదవినైనా ఇవ్వాలని బీజేపీ పెద్దలను నితీశ్ కోరుతున్నారట. టీడీపీకి 16 మంది ఎంపీల బలం ఉంది. సీట్ల సంఖ్యపరంగా జేడీయూ కంటే టీడీపీయే పెద్దది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే టీడీపీకి ప్రయారిటీ దక్కే అవకాశం ఉంది.
గతంలోనూ ఓసారి లోక్సభ స్పీకర్(Lok Sabha Speaker Post) పదవిని చేపట్టిన ట్రాక్ రికార్డు టీడీపీకి ఉంది. టీడీపీ నుంచి జీఎంసీ బాలయోగికి మాజీ ప్రధాని వాజ్పేయి (ఎన్డీయే) హయాంలో లోక్సభ స్పీకర్గా కీలక అవకాశం దక్కింది. మరోసారి ఆ అవకాశాన్ని టీడీపీకి మోడీ కల్పించినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. జేడీయూతో పోలిస్తే టీడీపీని ఎన్డీయే కూటమికి నమ్మకమైన మిత్రపక్షంగా ప్రధాని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే స్పీకర్ పదవి రేసులో జేడీయూతో పోలిస్తే టీడీపీ ముందంజలో ఉందని అంటున్నారు. ఒకవేళ లోక్సభ స్పీకర్ పదవిని తమ వద్దే ఉంచుకోవాలని మోడీ భావిస్తే.. ఏపీ బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి ఆ అవకాశం దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇంగ్లిష్, హిందీ సహా పలు భాషల్లో ఆమె చక్కగా మాట్లాడగలరు. గతంలో కేంద్రమంత్రిగానూ ఆమె సేవలు అందించారు. ఎన్టీఆర్ కుమార్తెగా పురందేశ్వరికి మంచి రాజకీయ నేపథ్యం ఉంది. అందుకే ఆమెకు లోక్సభ స్పీకర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని రాజకీయ పండితులు అంటున్నారు.